
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్కు ముందు భారత జట్టు అహ్మదాబాద్కు చేరుకుంది. ముంబైలో ఇంగ్లండ్తో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరింది. మార్చి 8న ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదికగా గుర్తింపు పొందిన నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్తో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా రెండు టైటిళ్లు గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలవనుంది. అంతేకాదు స్వదేశంలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన మొదటి జట్టుగా కూడా కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.
సెమీఫైనల్ ముగిసిన అనంతరం ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన భారత జట్టు అహ్మదాబాద్కు చేరుకుంది. ఇంగ్లండ్పై కీలక సెమీఫైనల్లో ఉత్కంఠభరిత పోరులో 7 పరుగుల తేడాతో గెలిచిన తర్వాత ఇప్పుడు భారత జట్టు పూర్తిగా ఫైనల్ మ్యాచ్పై దృష్టి పెట్టింది.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్కు అర్హత సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత జట్టు ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్కు చేరుకుంది. విమానాశ్రయం నుంచి ఆటగాళ్లు తమ తమ వాహనాల్లో జట్టు బస చేస్తున్న హోటల్కు వెళ్లారు. స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్, పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వేర్వేరు కార్లలో బయలుదేరగా, జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు మిగతా ఆటగాళ్లు టీమ్ హోటల్కు చేరుకున్నారు.
ఇప్పుడు భారత జట్టు ముందు ఉన్న అవకాశాలు చరిత్రాత్మకంగా నిలిచేలా ఉన్నాయి. గత ఎడిషన్లో టీ20 వరల్డ్ కప్ టైటిల్ను సొంతం చేసుకున్న భారత్ ఈసారి కూడా ట్రోఫీ గెలిస్తే వరుసగా రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటివరకు ఏ జట్టూ ఈ అరుదైన ఘనత సాధించలేదు.
ఇప్పటికే వరుసగా రెండు టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్కు చేరిన తొలి జట్టుగా భారత్ రికార్డు నమోదు చేసింది. ఫైనల్లో విజయం సాధిస్తే ఆ ఘనత మరింత ప్రత్యేకంగా మారనుంది. అదనంగా మరో అరుదైన రికార్డు కూడా భారత్ ముందుంది.
ఇప్పటివరకు ఏ దేశం కూడా స్వదేశంలో టీ20 వరల్డ్ కప్ టైటిల్ను గెలుచుకోలేదు. ఈసారి ఫైనల్ మ్యాచ్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరొందిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుండటంతో, స్వదేశ అభిమానుల ముందే చరిత్రను తిరగరాసే అవకాశం భారత్కు లభించింది. ఈ స్టేడియంలో సుమారు 1.30 లక్షలకుపైగా ప్రేక్షకులు ప్రత్యక్షంగా మ్యాచ్ను వీక్షించే సామర్థ్యం ఉంది. ఫైనల్ కోసం స్టేడియం పూర్తిగా అభిమానులతో నిండిపోతుందని అంచనా వేస్తున్నారు.
అయితే ప్రత్యర్థి జట్టు న్యూజిలాండ్ను తక్కువ అంచనా వేయలేం. నాకౌట్ మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శన చేయడంలో కివీస్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే ఈ ఫైనల్ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశముంది. అయినప్పటికీ స్వదేశ మైదానం, అభిమానుల మద్దతు, మంచి ఫామ్లో ఉన్న ఆటగాళ్లు వంటి అంశాలు భారత జట్టుకు బలంగా నిలుస్తున్నాయి.

