
ఆంధ్రప్రదేశ్లో రైతులకు శుభవార్త. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత డబ్బులు ఈ నెల 19న విడుదల కానున్నాయి. అర్హులైన 46 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.7 వేలు చొప్పున జమ కానున్నాయి. ఆధార్ మ్యాపింగ్ వంటి సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతులు రైతు సేవా కేంద్రాల్లో తమ స్టేటస్ తెలుసుకుని, మీ సేవ కేంద్రాల్లో పరిష్కరించుకోవచ్చు. ఎన్నికల హామీలో భాగంగా ఈ పథకం కింద మొత్తం రూ.20 వేలు అందించనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది.. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు విడుదలపై క్లారిటీ ఇచ్చింది. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం రెండో విడత డబ్బులు విడుదలపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష చేశారు. ఈ నెల 19న ‘అన్నదాత – సుఖీభవ’ రెండో విడత నిధుల విడుదలకు సన్నద్ధం అవుతుండగా.. అధికారులతో ఈ అంశంపై చర్చించారు. ఈ నెల 19న రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.7 వేలు జమ చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రాష్ట్ర వాటా కింద రూ.5 వేలు, కేంద్రం వాటా కింద రూ.2 వేలు కలిపి ఒక్కొక్కరికి రూ.7 వేలు చొప్పున జమ చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా కమలాపురంలో నిధులు విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు. ‘అన్నదాత – సుఖీభవ’ కింద రెండో విడతలో 46 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది
