
దివ్యాంగుల సదరం స్లాట్ బుకింగ్లో దళారుల ప్రమేయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. స్లాట్ బుకింగ్, బదిలీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న దళారులను నమ్మవద్దని, వారి ద్వారా బుకింగ్ చేసుకుంటే స్లాట్లు రద్దు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల కోసం సదరం స్లాట్ బుకింగ్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం వైకల్య ధ్రువపత్రాల జారీకి నిర్వహిస్తున్న సదరం శిబిరాల్లో స్లాట్ బుకింగ్, బదిలీల పేరుతో వసూళ్ల వ్యవహారం బయటపడింది. కొందరు దళారులు దివ్యాంగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రభుత్వం హెచ్చరించింది. దివ్యాంగుల్ని మోసం చేస్తున్న ఈ చర్యలను అరికట్టేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. సదరం స్లాట్ల విషయంలో దళారులను నమ్మవద్దని.. వారి ద్వారా బుకింగ్ చేసుకుంటే స్లాట్లు రద్దు చేస్తామంది. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. దివ్యాంగులు నేరుగా ప్రభుత్వ అధికారులను సంప్రదించి, ఉచితంగా సదరం శిబిరాల్లో స్లాట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. దళారుల ప్రమేయం లేకుండా ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరింది.
