
ఆంధ్రప్రదేశ్లో సీనియర్ జడ్జి బి. కృష్ణవేణిని సర్వీసు నుంచి తొలగించడం కలకలం రేపుతోంది. తీర్పులు రాయకపోవడం, సంతకాలు చేయకపోవడం వంటి ఆరోపణలపై హైకోర్టు సిఫార్సు మేరకు ఈ చర్య తీసుకున్నారు. ఇదిలా ఉండగా, నిబంధనలు ఉల్లంఘించిన 17 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లపై కూడా వేటు పడింది. న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం పెంచే దిశగా ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టిందనే చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్లో సీనియర్ జడ్జిను సర్వీసు నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి బి కృష్ణవేణిని సర్వీసు నుంచి తొలగించారు. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో హైకోర్టు సిఫార్సు మేరకు చర్యలు తీసుకున్నారు. తీర్పులు రాయకపోవడం, అలాగే ఉత్తర్వులపై కూడా సంతకాలు చేయకపోవడం, సిబ్బందికి న్యాయపరమైన పనులు అప్పగించడం వంటి ఆరోపణలు వచ్చాయి. కృష్ణవేణిపై ధర్మవరం బార్ అసోసియేషన్ కూడా ఫిర్యాదు చేసింది. ఆమెపై మొత్తం 12 అభియోగాలు నమోదయ్యాయి.
