
మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం అని మనం అనుకుంటే.. దానికి సరైన ఇంధనాన్ని అందించి ముందుకు నడిపించే ఇంజన్ మన జీర్ణవ్యవస్థ. అంతటి విశేషమైన ప్రాధాన్యత ఉన్న ఇంజన్ మసాలా ఆహారాలు, నూనెలు, ఒత్తిడి వంటి వాటి వల్ల తరచుగా గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం అనే సమస్యతో మొరాయిస్తూ ఉంటుంది. దీంతో హాస్పిటల్స్, మందుల షాపుల చుట్టూ తిరగడం మన పనైపోయింది. ఇకనైనా ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన పదార్థాలు తీసుకుందాం.. మన ఇంజన్ను మనమే బాగు చేసుకుందాం.
గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం ప్రస్తుతం ప్రతి నలుగురిలో కనీసం ఇద్దరు ఎదుర్కొంటున్న సమస్య. ఉరుకుల పరుగుల జీవితం, వేళాపాళా లేకుండా తినడం, అతిగా తినడం, ఒత్తిడి వంటి వాటి కారణంగా ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. వీటివల్ల కేవలం తేన్పులే కాదు.. గ్యాస్ వదలడమూ ఎక్కువ అవుతూ ఉంటుంది. వాస్తవానికి ఇది చాలా పెద్ద సమస్య. కానీ ఎవరితో చెప్పుకోలేరు. చెప్పడానికి గిల్టీగా ఫీల్ అవుతారు. అలా అని నిర్లక్ష్యం చేస్తే రోజు రోజుకూ మరీ ఇబ్బందిగా మారుతుంది. అందుకే వీలైనంత తొందరగా ఈ సమస్యలను తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. దీనికి మన వంటగదిలో ఉండే పదార్థాలతో నేచురల్ పద్ధతిలో పరిష్కరించుకోవచ్చని డాక్టర్ అనుపమ ఎన్ కే, సీనియర్ కన్సల్టెంట్ – మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఆస్టర్ సీఎంఐ హాస్పిటల్ తెలిపారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
డాక్టర్ అనుపమ ఎన్ కే చెబుతున్న పరిష్కారాలు ఏమిటంటే.. గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి జీర్ణక్రియ సమస్యలు చాలా సాధారణం. అతిగా తినడం, మసాలా ఆహారాలు, ఒత్తిడి, క్రమం లేని ఆహారపు అలవాట్లు వంటివి కారణం. అయితే గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి గ్యాస్ తగ్గుతుంది. అలాగే ఒక స్పూన్ జీలకర్రను నీళ్లలో మరిగించి జీరా వాటర్ త్రాగడం వల్ల ఉబ్బరం తగ్గుతుంది. అల్లం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. భోజనం తర్వాత చిన్న అల్లం ముక్కను నమలడం లేదా అల్లం టీ త్రాగడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది. వాము (అజ్వైన్) గ్యాస్ సమస్యలకు తక్షణ పరిష్కారాన్ని ఇస్తుంది.

