
Sensex Surge: అమెరికా అధ్యక్షుడు Donald Trump చేసిన కీలక వ్యాఖ్యలతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో స్టాక్ మార్కెట్లు జోష్తో ముందుకు దూసుకెళ్తున్నాయి. మార్చి 25న ఉదయం 11 గంటల సమయానికి సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతోంది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 10 లక్షల కోట్లకు పైగా పెరిగినట్లు తెలుస్తోంది.
Investors Wealth: భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్లో గణనీయమైన లాభాలు నమోదు చేస్తున్నాయి. ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొంత తగ్గినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. గత సెషన్లో సెన్సెక్స్ 1372 పాయింట్లు ఎగసిపడగా, నిఫ్టీ దాదాపు 400 పాయింట్లు పెరిగింది.
ఇక ఇవాళ మరోసారి ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికా–ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ నుంచి సానుకూల స్పందన లభించిందని వెల్లడించారు. అలాగే అణ్వాయుధాల తయారీని నిలిపివేయడానికి కూడా ఇరాన్ అంగీకరించిందని పేర్కొన్నారు.
దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు క్రమంగా చల్లబడుతున్నాయని భావిస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యల ప్రభావంతో ముడి చమురు ధరలు గరిష్ట స్థాయిల నుంచి క్షీణించాయి. నిన్న 100 డాలర్లకు పైగా ఉన్న ధరలు ఇవాళ 5 శాతానికి పైగా తగ్గి ప్రస్తుతం 95 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇంట్రాడేలో 93 డాలర్ల వరకు పడిపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల విశ్వాసం బలపడింది.
చమురు ధరల తగ్గుదలతో స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మార్చి 25న ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా లాభపడి 75,650 స్థాయిని దాటింది. ఇదే సమయంలో నిఫ్టీ దాదాపు 500 పాయింట్లు పెరిగి మంచి స్థాయిలో ట్రేడవుతోంది. సెషన్ ప్రారంభంలోనే సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్ల లాభాలతో ప్రారంభమైంది.
మార్కెట్లు బలంగా ఉండటంతో పలు స్టాక్స్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు దాదాపు 3 శాతం వరకు పెరిగాయి. ఎం అండ్ ఎం షేర్ 4 శాతం వరకు ఎగసింది. బ్యాంకింగ్, స్టీల్ రంగాలకు చెందిన ఇతర షేర్లు కూడా మంచి లాభాల్లో ఉన్నాయి. ఫార్మా, ఐటీ రంగాలు స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి.
ఇక ఇన్వెస్టర్ల సంపద కూడా భారీగా పెరిగింది. గత సెషన్లో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 422.78 లక్షల కోట్లుగా ఉండగా, ఇవాళ అది రూ. 10 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ. 433 లక్షల కోట్లను దాటింది. దీంతో మదుపరుల సంపద గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు. అయితే చమురు ధరలు తగ్గుతుండటంతో బంగారం ధరలు మళ్లీ పెరుగుదల చూపిస్తున్నాయి.

