
Govt Pension Scheme: నెలకు కేవలం రూ.55 చెల్లిస్తే జీవితాంతం నెలకు రూ.3,000 పెన్షన్ పొందే అద్భుత పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అదే ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన (PM-SYM). అసంఘటిత రంగ కార్మికులకు భద్రత కల్పించేందుకు రూపొందించిన ఈ పథకం గురించి తాజాగా పార్లమెంటులో కేంద్ర కార్మిక శాఖ వివరాలు వెల్లడించింది.
మీరు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారా? ఉద్యోగుల మాదిరిగా రిటైర్మెంట్ తర్వాత ఆదాయం లేకపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారా? అయితే ఆ భయం అవసరం లేదు. ఈ పథకం ద్వారా మీరు కూడా వృద్ధాప్యంలో నెలనెలా స్థిరమైన పెన్షన్ పొందవచ్చు. 2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా 60 ఏళ్లు పూర్తి అయిన తర్వాత నెలకు రూ.3,000 గ్యారంటీగా అందుతుంది.
ఈ స్కీమ్ ముఖ్యంగా వీధి వ్యాపారులు, నిర్మాణ కార్మికులు, గృహ సేవకులు, చిన్న వ్యాపారులు వంటి అసంఘటిత రంగాల్లో పనిచేసే వారి కోసం రూపొందించబడింది. కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఇటీవల పార్లమెంటులో మాట్లాడుతూ ఈ పథకం ప్రయోజనాలను వివరించారు.
రూ.3000 పెన్షన్ ఎలా వస్తుంది?
ఈ పథకం ఒక వాలంటరీ మరియు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఇందులో చేరిన వ్యక్తి ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తం చెల్లించాలి. అదే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. 60 ఏళ్ల తర్వాత ఈ కలిపిన నిధి ఆధారంగా నెలకు రూ.3,000 పెన్షన్ అందుతుంది.
అర్హతలు ఏమిటి?
- వయస్సు: 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి
- నెలవారీ ఆదాయం: రూ.15,000 లోపు
- ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ లేదా ఎన్పీఎస్ సభ్యత్వం ఉండకూడదు
ఎంత చెల్లించాలి?
చెల్లించాల్సిన మొత్తం వయస్సు ఆధారంగా ఉంటుంది:
- 18 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.55
- 40 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.200
ఈ మొత్తానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి నెలా చెల్లిస్తుంది. అంటే సభ్యుడు కేవలం సగం మొత్తమే భరిస్తాడు.
ఎలా నమోదు చేసుకోవాలి?
ఈ పథకంలో చేరాలనుకునే వారు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) వద్ద నమోదు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో సీఎస్సీ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మాన్ ధన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2026 మార్చి 12 నాటికి ఈ పథకంలో సుమారు 52.5 లక్షల మంది లబ్ధిదారులు చేరారు. దీంతో అసంఘటిత రంగ కార్మికుల్లో ఈ పథకంపై అవగాహన పెరుగుతోందని తెలుస్తోంది.

