ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ‘కౌశలం’ సర్వే ద్వారా పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కల్పించనుంది. సచివాలయాల్లోనే ఆన్లైన్ పరీక్షలు నిర్వహించి, అర్హత సాధించిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. వెబ్ కెమెరాలు, హెడ్ ఫోన్లు సిద్ధం చేశారు. త్వరలోనే ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని చెబుతున్నారు

ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ‘కౌశలం’ పేరుతో సర్వే నిర్వహించింది. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారి వివరాలను సేకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ‘వర్క్ ఫ్రం హోం’ విధానంలో ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా, ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన వెబ్ కెమెరాలు, హెడ్ ఫోన్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. ప్రతి సచివాలయంలో ఇద్దరు సిబ్బందికి ఆన్లైన్ నమూనా పరీక్షలు నిర్వహించి, వారి సామర్థ్యాన్ని అంచనా వేశారు. ఈ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. అర్హత సాధించిన అభ్యర్థులకు వారి ఫోన్ నంబర్లకు లేదా ఈ-మెయిల్ ఐడీలకు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని పంపనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.
