
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత స్టాక్ మార్కెట్లపై గణనీయమైన ప్రభావం కనిపిస్తోంది. విదేశీ పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటంతో మార్కెట్లలో ఒత్తిడి పెరిగింది. అంతర్జాతీయ అనిశ్చితి, రాజకీయ-భౌగోళిక ఉద్రిక్తతలు, ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు సూచీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
మార్చి నెలలో మార్కెట్లు గణనీయంగా కుదేలయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 7 వేల పాయింట్లకు పైగా పడిపోగా, దాదాపు రూ.40 లక్షల కోట్ల మార్కెట్ సంపద ఆవిరైంది. గత గురువారం కూడా సూచీలు భారీగా పడిపోయాయి. మార్చి 23న కూడా మార్కెట్ ప్రారంభంలో సెన్సెక్స్ 1900 పాయింట్లకు పైగా నష్టపోయి, మధ్యాహ్నం 2:15 గంటల సమయానికి 1500 పాయింట్ల నష్టంతో 73,100 స్థాయిలో ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ కూడా 470 పాయింట్లు కోల్పోయి 22,640 వద్ద కొనసాగుతోంది.
ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా కొన్ని పెన్నీ స్టాక్స్ మాత్రం గమనార్హమైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. గత మూడు నెలల్లో ఎనిమిది పెన్నీ షేర్లు 10 శాతం నుంచి గరిష్ఠంగా 430 శాతం వరకు రాబడులు అందించాయి. వీటిలో రెండు షేర్లు మల్టీబ్యాగర్గా నిలవడం విశేషం. సాధారణంగా రూ.1000 కోట్లలోపు మార్కెట్ క్యాపిటలైజేషన్, రూ.20 లోపు షేర్ ధర కలిగిన కంపెనీలను పెన్నీ స్టాక్స్గా పరిగణిస్తారు.
ఏస్ ఈక్విటీ డేటా ప్రకారం, మార్కెట్ ఒడిదుడుకుల్లోనూ మెరుగైన రాబడులు ఇచ్చిన స్టాక్స్లో హిట్ కిట్ గ్లోబల్ సొల్యూషన్స్ షేర్ ఈరోజు (మార్చి 23) 5 శాతం పెరిగి రూ.6.20 వద్ద ట్రేడ్ అవుతోంది. గత మూడు నెలల్లో ఇది సుమారు 432 శాతం ర్యాలీ చేసింది. స్టార్లైన్పీఎస్ ఎంటర్ప్రైజెస్ షేర్ ధర రూ.11.50 వద్ద ఉండగా, ఇది 262 శాతం వరకు పెరిగి మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది.
ఇతర స్టాక్స్ విషయానికి వస్తే, విక్రమ్ సువర్ణ్ షేర్ ధర రూ.10.70 వద్ద ఉండి, మూడు నెలల్లో 35 శాతం పెరిగింది. అద్విక్ క్యాపిటల్ కూడా అదే స్థాయిలో పెరుగుదల చూపింది. సత్వా సుకున్ లైఫ్కేర్, సిల్వర్లైన్ టెక్నాలజీస్ షేర్లు సుమారు 16 శాతం చొప్పున పెరిగాయి. ప్రస్తుతం సిల్వర్లైన్ టెక్నాలజీస్ ధర రూ.11 వద్ద ఉంది. గ్రోయింగ్టన్ వెంచర్స్ ఇండియా షేర్ ధర 15 శాతం పెరగగా, కంఫర్ట్ ఇన్టెక్ షేర్ ధర దాదాపు 9 శాతం లాభాన్ని నమోదు చేసింది.

