
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. ఢిల్లీ పర్యటనలో కేంద్రానికి చేసిన రిక్వెస్ట్కు ఓకే చెప్పారు. ఏపీలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అజీవిక మిషన్ గ్రామీణ్ (వీబీజీరామ్జీ) పథకం జాతీయ స్థాయిలో ఏపీలోనే ప్రారంభించనున్నారు. జులై 2న తిరుపతి జిల్లా కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లిలో ప్రారంభిస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ హాజరవుతారు.
ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించింది.. అనుకున్నది సాధించింది. ఢిల్లీ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినతి మేరకు కీలకమైన పథకం ఏపీలోనే ప్రారంభం కాబోతోంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన వీబీ జీ రాం జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అజీవిక మిషన్ గ్రామీణ్) ప్రారంభ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన వీబీ జీ రాం జీని జాతీయ స్థాయిలో ఇక్కడే ప్రారంభించనున్నారు. జులై 2న ఉదయం 11 గంటలకు తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం ముక్కవారిపల్లెలో ప్రారంభిస్తారు. ఈ వీబీ జీ రాం జీ ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారు.
ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీబీ జీ రాం జీ పథకాన్ని ఏపీలో ప్రారంభించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను కోరారు. పవన్ రిక్వెస్ట్పై సానుకూలగా స్పందించి శివరాజ్సింగ్ చౌహాన్ ఏపీలో ప్రారంభించేందుకు ఓకే చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కృష్ణతేజ, తిరుపతి జిల్లా అధికారులు రైల్వేకోడూరు నియోజకవర్గంలో పర్యటించారు.. అనంతరం ముక్కవారిపల్లెలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి గతంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభోత్సవం అప్పటి యూపీఏ ప్రభుత్వం 2006 ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీబీ జీ రాం జీ పథకం కూడా ఏపీలోనే మొదలుకానుంది.

