
విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక గెజిట్ విడుదల చేసింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా శనివారం ప్రారంభమయ్యే ఈ విమానాశ్రయం ఆగస్టు 17 నుంచి కార్యకలాపాలు మొదలుపెట్టనుంది. దీంతో విశాఖపట్నంలో పౌర విమానాశ్రయాన్ని ఆగస్టు 16వ తేదీ అర్ధరాత్రి నుంచి మూసివేస్తున్నట్టు గెజిట్లో కేంద్రం ప్రకటించింది. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ ప్రతిపాదన చేసినప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దీనిపై ఒప్పందం జరిగింది.
దాని ప్రకారం భోగాపురంలో ఆపరేషన్లు ప్రారంభమైన నాటినుంచి 30 ఏళ్ల పాటు విశాఖ విమానాశ్రయం (ఐఎన్ఎస్ డేగ) నుంచి పౌర విమానాలు నడపకూడదు. దానిని ఇప్పుడు అమలు చేయనున్నట్టు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విశాఖకు కేటాయించిన ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టు కోడ్ ‘వీటీజెడ్ను అల్లూరి విమానాశ్రయానికి బదలాయిస్తున్నట్లు తెలిపింది.
విశాఖపట్నం విమానాశ్రయం నేవీ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఒకవైపు నేవీ, మరోవైపు పౌర విమాన శాఖ దానిని ఉపయోగించుకుంటున్నాయి. పౌర విమాన సర్వీసులు ఆగస్టు 17 నుంచి నిలిపివేసినా, నాన్ షెడ్యూల్డ్ విమాన సేవలు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థలకు చెందిన చార్టర్డ్ విమానాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ముఖ్యులు వచ్చినప్పుడు వారి విమానాలు, హెలికాప్టర్లు దిగడానికి, ఇక్కడినుంచి బయలుదేరడానికి ఈ విమానాశ్రయాన్ని ఉపయోగించుకుంటారు.

