
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం శనివారం అట్టహాసంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా 13 వేల మందితో నిర్వహించిన థింసా నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ కూడా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఉత్సాహభరితంగా సాగిన ఈ డ్యాన్స్ తన మనసును తాకిందని.. గిరిజనుల గొప్ప సంప్రదాయాలకు నిదర్శనంగా నిలిచిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మీయతకు, రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి, మన గిరిజన సమాజాల గొప్ప సంప్రదాయాలకు ఈ అద్భుత ప్రదర్శన నిదర్శనంగా నిలిచిందని కొనియాడారు. అలాగే అత్యంత నైపుణ్యంతో హస్త కళతో రూపొందించిన బొబ్బిలి ఏకాండ వీణను అందుకోవడం కూడా ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని ట్వీట్ చేశారు. భారతీయ సంగీత సంప్రదాయాల్లో వీణకు ఒక విశిష్ట స్థానం ఉందని.. ఈ వీణ ఆంధ్రప్రదేశ్ కళాకారుల అపూర్వ నైపుణ్యానికి ప్రతీకగా ప్రధాని అభివర్ణించారు.
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో మన బిడ్డలు థింసా నృత్యంతో ఆంధ్రప్రదేశ్కు గర్వకారణంగా నిలిచారని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాలకు చెందిన 13,000 మందికి పైగా ఆడబిడ్డలు తమ ప్రదర్శనతో ప్రపంచ రికార్డు సృష్టించారని.. మన సంప్రదాయాలు, భవిష్యత్ ఆకాంక్షలను అందంగా ప్రదర్శించారని ప్రశంసించారు.
మన అభివృద్ధి ప్రయాణంతో పాటు మన వారసత్వం కూడా ముందుకు సాగే “వికాస్ భీ, విరాసత్ భీ” యొక్క నిజమైన స్ఫూర్తి ఇదేనంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ సందర్భాన్ని ఇంత ప్రత్యేకంగా మార్చడంలో అంకితభావం, కృషి, అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆడబిడ్డలకు, వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

