
రాజమండ్రి మెడికోల ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తప్పు చేసింది ఎవరైనా ఉపేక్షించవద్దని.. కఠిన శిక్షలు పడేలా చూడాలని స్పష్టం చేశారు. గాయపడిన మెడికోల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు.. ప్రియాంక ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
రాజమహేంద్రవరంలో మెడికోల ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. మెడికోలను కారుతో ఢీ కొట్టిన ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో గాయపడిన మెడికోలు ప్రియాంక, ఉమేష్ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. మెడికోలు తీవ్రంగా గాయపడడం బాధాకరమన్న చంద్రబాబు.. తప్పు చేసిన వారిని ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. మెడికో ప్రియాంక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బాధితులకు అత్యుత్తమ సాయం అందించాలని.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్ అనే ఇద్దరు యువకులు మద్యం మత్తులో కారును నిర్లక్ష్యంగా నడిపి.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మెడికోలు ప్రియాంక, ఉమేష్ను ఢీకొట్టారని.. అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్యమాల్ వద్ద ఆగస్ట్ మూడో తేదీన జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనలో ప్రియాంక తలకు తీవ్రంగా గాయాలు కాగా.. తొలుత స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అయితే ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమించటంతో బుధవారం రోజున హైదరాబాద్ తరలించి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. మరో వైద్య విద్యార్థి స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఈ ఘటనలో ఇద్దరు నిందితులు దుష్యంత్, జోసెఫ్లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారిపై నేరపూరిత హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నారు. ఇందులో భాగంగా గురువారం రోజున ఆస్పత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రిమాండ్కు తరలించారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా.. సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

