
నెల్లూరు జిల్లాలో గిరిజనులకు తేనె తయారీపై ప్రభుత్వం శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గోల్డెన్ హనీ బీ ఫాం ఇండస్ట్రీ సంస్థ సభ్యులు, నెల్లూరు జిల్లా ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు సమక్షంలో అమరావతిలో ఎంవోయూ కూడా కుదిరింది. నేల మీదే తేనె తయారు చేసేలా శిక్షణ ఇవ్వనున్నారు. మూడేళ్ల పాటు ఈ ప్రాజెక్టు ఉంటుందని.. రోజుకు 200 కిలోల వరకు తేనె తీయొచ్చు అని అధికారులు చెబుతున్నారు.
అడవి తల్లిని నమ్ముకుని బతికే గిరిజనులకు ఆ అడవే జీవనాధారం. ఆ అడవిలో దొరికే వాటిని అమ్ముకునే బతుకుతున్నారు. అలాంటి గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. తేనె తయారీలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు వాటిని మార్కెట్ చేసుకునేలా ఒక ప్రాజెక్టు తీసుకురానుంది. అయితే, ఇది అన్ని జిల్లాల్లోని గిరిజనులకు కాదు.. కేవలం నెల్లూరు జిల్లాలోని గిరిజనుల కోసమే. ఇప్పటికే పాడేరు, చిత్తూరు జిల్లాల్లో అమలు చేసి సక్సెస్ అయిన ఈ తేనె తయారీ ప్రాజెక్టును నెల్లూరు జిల్లాలో అమలుచేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గోల్డెన్ హనీబీ ఫాం ఇండస్ట్రీ సంస్థ సభ్యులు, నెల్లూరు జిల్లా ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు సమక్షంలో అమరావతిలో దీనిపై ఎంవోయూ కూడా కుదిరింది. పాత నెల్లూరు జిల్లాలోని అటవీప్రాంతాలైన వెంకటగిరి, డక్కిలి, రాపూరు, బాలాయపల్లి గ్రామాల్లో సుమారు 300 మంది గిరిజనులు నివాసం ఉంటున్నారు. అడవుల్లో చెట్లెక్కి తేనె సేకరించి అమ్మడమే వీరి జీవనోపాధి. అయితే, వీరి జీవితాలు బాగు చేసేలా తేనె సేకరణకు ఆధునిక పద్ధతులు జోడించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తేనె తయారీలో శిక్షణ ఇస్తే గిరిజనుల జీవితాలు బాగుపడతాయనేదే ప్రభుత్వ ఆలోచన.
ఈ తేనె తయారీకి ఆసక్తి ఉన్న గిరిజనులను ముందుగా ఎంపిక చేస్తారు. వారికి చెట్లపై తేనెను తీయడమే కాకుండా నేల మీద కూడా ఎలా తయారు చేయాలి అనే విధానాన్ని నేర్పిస్తారు. తేనె ఉత్పత్తి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, బ్రాండ్ను ప్రజల్లోకి ఎా తీసుకెళ్లాలో అనే విషయాలపై దశలవారీగా శిక్షణ ఇస్తారు. మూడేళ్ల వరకు ఈ ప్రాజెక్టు ఉంటుందని, రోజుకు 200 కిలోల తేనె తయారీ సులభంగా చేసుకునేలా ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది.
కేవలం తేనె ఒక్కటే కాకుండా ఒక మార్ట్ల ఏర్పాటు చేసి అడవిలో దొరికే మిగతా వస్తువులు అమ్ముకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఆ మార్ట్కు గిరిమార్ట్ అనే పేరు కూడా పెడుతుంది. గిరిజనులకు స్వయం ఉపాధి కల్పించేలా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఈ మార్ట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది.

