
ఒంగోలు సెంటర్గా మాజీ మంత్రి బాలినేని, ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. జనార్దన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఒంగోలులో స్వతంత్రంగా పోటీ చేయాలన్నారు. అసలు జనసేన లేకపోతే ఎమ్మెల్యేగా గెలిచేవారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపైనా, జనార్దన్పైనా విచారణ జరిపించాలని.. కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధమని.. జనార్దన్ కూడా చేస్తారా అంటూ ప్రశ్నించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు రాజకీయాలు వేడెక్కాయి.. మాజీమంత్రి, జనసేన పార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. దామచర్ల అవినీతికి పాల్పడతున్నారని బాలినేని ఆరోపిస్తే.. వైఎస్సార్సీపీ హయాంలో బాలినేని అవినీతి గురించి చెప్పాలంటే పుస్తకాలు కూడా సరిపోవన్నారు. తాజాగా ఎమ్మెల్యే దామచర్లకు బాలినేని మరోసారి కౌంటరిచ్చారు.. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనతో పోటీపడాలని సవాల్ చేశారు. ఇద్దరం ఇండిపెండెంట్లుగా పోటీ చేద్దామని.. తాను 30వేల మెజార్టీతో గెలుస్తానన్నారు. ఒకవేళ తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. జనసేన పార్టీ లేకపోతే దామచర్ల అసలు ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి లేదన్నారు.
తాను జనసేనలో పార్టీలో చేరి ఉండకపోతే లోపల వేయించేవాడినని ఎమ్మెల్యే జనార్దన్ అన్నారని.. తాను అవినీతి చేశాను అనుకుంటే సీఎం చంద్రబాబుకు చెప్పి విచారణ జరిపించాలని దామచర్లకు సవాల్ చేశారు బాలినేని. తాను కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు చెప్పి దామచర్లపై విచారణ చేయిస్తానన్నారు. ఒంగోలులో తన అనుచరులపై కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపించారు. ఒంగోలు కార్పొరేషన్లో మిస్సైన రూ.8.5 కోట్లు ఏమయ్యాయో దామచర్ల చెప్పాలన్నారు. తాను వెళ్లి హైదరాబాద్లో కూర్చుంటున్నానని దామచర్ల విమర్శించారని.. ఒంగోలులో జరిగే అవినీతి చూడలేక అక్కడికి వెళ్లి కూర్చుంటున్నాను అన్నారు. సెటిల్మెంట్లు, ఇసుక, మద్యం, రేషన్ డీలర్ల నుంచి నెల నెలా మామూళ్లు రావడం లేదా? అంటూ సెటైర్లు పేల్చారు.
ఎమ్మెల్యే జనార్దన్పై చేసిన ఆరోపణలపై కాణిపాకంలో ప్రమాణానికి తాను సిద్ధమన్నారు బాలినేని. జనార్దన్ ఈ ఆరోపణలపై ప్రమాణం చేయడానికి కాణిపాకం వెళ్దామన్నారని.. కాణిపాకం వెళ్లేందుకు తాను సిద్ధమన్నారు. ఎప్పుడు వెళ్లాలో టైమ డిసైడ్ చేయాలని ఎమ్మెల్యేకు సవాల్ చేశారు. దామచర్ల ఎమ్మెల్యే అయ్యాక జనసేన పార్టీ నేతల్లో రియాజ్తో పాటు ఒకరిద్దరికి పదవులు ఇచ్చారని.. ఆయనకు ఓట్లు వేసిన జనసైనికులకు ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనార్దన్ ఒంగోలుకు చేసింది ఏమీ లేదన్నారు. మొత్తం మీద ఒంగోలు కూటమిలో మొదలైన ఈ మాటల యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.

