
కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సరుకు రవాణాను మరింత వేగవంతం చేయడంతో పాటు నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించే లక్ష్యంతో విశాఖపట్నం పోర్టులో ఓ కీలక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.
విశాఖపట్నం పోర్ట్ అథారిటీ పరిధిలో రూ.334.89 కోట్ల అంచనా వ్యయంతో ఫ్లైఓవర్ (ఎలివేటెడ్ కారిడార్) నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును 30 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పోర్టు కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిర్మాణ పనులు చేపట్టేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే సరుకు రవాణా మరింత సులభతరం కావడంతో పాటు ట్రాఫిక్ సమస్యకు కూడా కొంతమేర పరిష్కారం లభించే అవకాశం ఉంది.
విశాఖపట్నం ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. పోర్టు పరిధిలో వాహనాల రాకపోకలు, సరుకు రవాణాను మరింత సులభతరం చేసేందుకు కీలక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. విశాఖపట్నం పోర్టులో ఫ్లైఓవర్ (ఎలివేటెడ్ కారిడార్) నిర్మించనున్నట్లు కేంద్ర ఓడరేవులు, నౌకాయాన శాఖ వెల్లడించింది.
సుమారు రూ.334.89 కోట్ల వ్యయంతో 3.584 కిలోమీటర్ల పొడవున ఈ ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును 30 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం పోర్టులోని 9 ప్రధాన రైల్వే క్రాసింగ్ల వద్ద తరచూ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే పోర్టు పరిధిలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గడంతో పాటు సరుకు రవాణా వాహనాలు వేగంగా, సులభంగా రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. దీంతో పోర్టు కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా కొనసాగేందుకు వీలుకలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
డాక్ ఏరియాను కాన్వెంట్ జంక్షన్తో అనుసంధానించేలా ఈ ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనున్నారు. దీంతో రైలు, రోడ్డు రవాణాను వేరు చేయడం ద్వారా పోర్టు పరిధిలో వాహనాల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. ప్రధాని గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా ఈ కారిడార్ను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇది విశాఖపట్నం పోర్టు సముద్ర రవాణా సామర్థ్యాన్ని మరింత పెంచడంతో పాటు ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు దోహదపడుతుందని అన్నారు.
మొత్తంగా ఈ ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే పోర్టు పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలకు గణనీయంగా పరిష్కారం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా రైల్వే లెవెల్ క్రాసింగ్ల వద్ద గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోయే వాహనదారులకు ఈ ప్రాజెక్టు ఎంతో ఉపశమనం కలిగించనుంది.

