
గుంటూరు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయ ఆధునికీకరణకు మరో కీలక ముందడుగు పడింది. నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి సీసీఎల్ ప్రొడక్ట్స్ (ఇండియా) వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్ రూ.20 కోట్లను వెచ్చించేందుకు ముందుకొచ్చారు.
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో చల్లా రాజేంద్రప్రసాద్, పౌర గ్రంథాలయ సంస్థ సంచాలకులు ఎ.కృష్ణమోహన్ మధ్య ఈ మేరకు ఎంవోయూ కుదిరింది. కొత్త భవనాన్ని సెల్లార్ + G+2 అంతస్తులుగా నిర్మించనున్నారు.
త్వరలో శంకుస్థాపన
గుంటూరు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మాధవి, చల్లా రాజేంద్రప్రసాద్, అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న భవనాన్ని తొలగించి.. ఆధునిక సౌకర్యాలతో కొత్త గ్రంథాలయాన్ని నిర్మించనున్నారు.
త్వరలో మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా నూతన భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గ్రంథాలయ నిర్మాణానికి రూ.20 కోట్లు అందించేందుకు ముందుకొచ్చిన చల్లా రాజేంద్రప్రసాద్ దాతృత్వం అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా కాఫీ బ్రాండ్లను పరిచయం చేసిన ఆయన.. ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ ఎగుమతిదారుగా గుర్తింపు పొందారని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

