
తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం మహిళా ఉద్యోగుల సంక్షేమం, అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు ఇద్దరు లేదా అంతకంటే తక్కువ మంది పిల్లలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగినులకు ఏడాది పాటు ప్రసూతి సెలవులు అందుతున్నాయి. అయితే మూడో సంతానం కలిగిన ఉద్యోగినులకు మాత్రం 12 వారాలకే ప్రసూతి సెలవులు పరిమితమయ్యాయి.
తాజా నిర్ణయం ప్రకారం, ఇకపై మూడో సంతానం ఉన్న మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఏడాది పాటు ప్రసూతి సెలవులు వర్తించనున్నాయి. మహిళా ఉద్యోగులకు ఇది ఎంతో ప్రయోజనకరమైన నిర్ణయంగా ప్రభుత్వం పేర్కొంది.
కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడో బిడ్డకు జన్మనిచ్చే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవులను 12 వారాల నుంచి ఏడాదికి పెంచాలని నిర్ణయించింది.
ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మానవ వనరుల శాఖ మంత్రి డి. శరత్ కుమార్ మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటివరకు ఇద్దరు లేదా అంతకంటే తక్కువ మంది పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులకు పూర్తి వేతనంతో 12 నెలల ప్రసూతి సెలవులు అందుతున్నాయి. అయితే మూడోసారి తల్లయ్యే ఉద్యోగినులకు మాత్రం కేవలం 12 వారాల సెలవు మాత్రమే మంజూరవుతోంది.
మహిళా సాధికారత, సామాజిక సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి శరత్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో మూడో బిడ్డకు జన్మనిచ్చే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న 12 వారాల ప్రసూతి సెలవును 365 రోజులకు పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
తమిళనాడులో ప్రసూతి సెలవుల వ్యవధిని గతంలోనూ పలుమార్లు పెంచారు. 2011లో 90 రోజులుగా ఉన్న సెలవులను ఆరు నెలలకు పెంచగా, 2016లో తొమ్మిది నెలలకు పొడిగించారు. అనంతరం జూలై 2021లో ప్రసూతి సెలవులను ఏడాదికి పెంచారు. ఇప్పుడు మూడో బిడ్డకు జన్మనిచ్చే మహిళా ఉద్యోగులకూ ఏడాది పాటు ప్రసూతి సెలవు కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇద్దరికంటే తక్కువ మంది పిల్లలు ఉన్న మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 365 రోజుల ప్రసూతి సెలవు సదుపాయం అందుతోంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం తమిళనాడు ప్రభుత్వం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న ఉద్యోగినులకు కూడా ప్రసూతి సెలవును 12 వారాలకు పెంచింది. తాజాగా ఈ సెలవును ఏడాదికి పొడిగిస్తున్నట్లు అసెంబ్లీలో మంత్రి ప్రకటించడంతో, దీనికి సంబంధించిన సమగ్ర ప్రభుత్వ ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి వెల్లడించినట్టు సమాచారం.
మరోవైపు, తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్. పల్లవి తన చంటి బిడ్డను ఎత్తుకుని అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలో తన సహాయకురాలికి బిడ్డను అప్పగించిన అనంతరం ఆమె సభా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె కేవలం ప్రచారం కోసమే బిడ్డను వెంట తీసుకువస్తున్నారని విమర్శిస్తుండగా, ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలు తదితర చోట్ల కూడా బిడ్డతో కనిపిస్తూ హడావుడి చేస్తున్నారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు, మహిళా ప్రజాప్రతినిధిగా ఆమె ఎదుర్కొంటున్న బాధ్యతలను అర్థం చేసుకోవాలని, బిడ్డను చూసుకుంటూనే ప్రజా జీవితంలో కొనసాగడం అభినందనీయమని కొందరు ఆమెకు మద్దతు పలుకుతున్నారు.

