
చాలా మంది ఎల్ఐసీలో ఇన్సూరెన్స్ తీసుకుంటుంటారు. ఇక్కడ మరి మీరు కట్టే ప్రీమియం డబ్బుల్ని ఎల్ఐసీ ఏం చేస్తుందో తెలుసా? దీనిని ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారనే విషయంపై కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వివరణ ఇచ్చింది. ఏ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందో మాత్రం వెల్లడించబోమని స్పష్టం చేసింది. కంపెనీల ఆర్థిక పరిస్థితి, రిస్క్ అంచనాలు, భవిష్యత్ వృద్ధి ఆధారంగానే పెట్టుబడులు పెడుతున్నట్లు స్పష్టం చేసింది.
భారతదేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీదారులు చెల్లించే ప్రీమియంను ఏం చేస్తుంది? ఈ అనుమానం చాలా మందికి వచ్చే ఉంటుంది. దేశంలో లక్షల్లో, కోట్లల్లో ఎల్ఐసీలో ప్రీమియం కడుతుంటారు. అయితే ఎల్ఐసీ దేశంలోనే అతిపెద్ద సంస్థాగత మదుపరి అన్న విషయం చాలా మందికి తెలియదు. అంటే ఈక్విటీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంది. ఈ క్రమంలోనే ఎల్ఐసీకి వచ్చే ప్రీమియం మొత్తాన్ని ఎక్కడ పెట్టుబడి పెడుతుంది? షేర్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తుంది? అనే ప్రశ్నలకు లోక్సభలో కేంద్రం సమాధానం ఇచ్చింది. కానీ ఇక్కడ ఏయే కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుందనే వివరాలు మాత్రం వెల్లడించబోమని క్లారిటీ ఇచ్చింది.
లోక్సభ సభ్యుడు రాజీవ్ రాయ్ అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గత ఐదేళ్లలో లిస్టెడ్ కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడుల పరిమాణం మారుతూ వచ్చిందని, ఇది సంస్థ స్వతంత్ర పెట్టుబడి అంచనాలు, బోర్డు ఆమోదించిన పెట్టుబడి విధానం, కంపెనీల భవిష్యత్తు వృద్ధి అవకాశాల ఆధారంగానే జరిగిందని తెలిపారు.
ఇక ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థల షేర్లలో పెట్టుబడులు పెట్టే ముందు ఎల్ఐసీ పలు కీలక అంశాల్ని పరిశీలిస్తుందని మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా కంపెనీల ఆర్థిక పనితీరు, భవిష్యత్ వృద్ధి అంచనాలు/అవకాశాలు, వ్యాపార సామర్థ్యం/బలం, ఫండమెంటల్స్ రిస్క్ ఫ్యాక్టర్ వంటి అంశాలపై సమగ్ర పరిశీలన అనంతరం మాత్రమే పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. దీని కోసం ఇప్పటికే అమల్లో ఉన్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను (SOP) అనుసరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

