
విశాఖపట్నంలో ఈదురుగాలుల ప్రభావంతో రైల్వే స్టేడియంలోని భారీ ఫ్లడ్లైట్ టవర్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో తృటిలో పెను ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఈ స్టేడియానికి వందలాది మంది వాకింగ్, జాగింగ్ కోసం వస్తుంటారు. అయితే ఫ్లడ్లైట్ కూలిన సమయంలో వర్షం, బలమైన గాలుల కారణంగా మైదానం ఖాళీగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. స్వల్ప వ్యవధి పాటు వీచిన ఈదురుగాలులకే భారీ ఫ్లడ్లైట్ కుప్పకూలడంతో నిర్మాణ నాణ్యత, నిర్వహణ ప్రమాణాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఘటనపై రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు. ఫ్లడ్లైట్ కూలిపోవడానికి గల కారణాలను సమగ్రంగా పరిశీలించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రాష్ట్రంలోని పలు జిల్లాలకు రానున్న మూడు గంటల పాటు ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా.. ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
ముఖ్యంగా అరకు, చింతపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చెట్ల కింద ఆశ్రయం పొందకుండా, బహిరంగ ప్రదేశాల్లో సంచరించకుండా జాగ్రత్తలు పాటించాలని ఏపీఎస్డీఎంఏ ప్రజలకు సూచించింది. అలాగే వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరింది.

