
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) చేరుకున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే మీద మొట్టమొదటగా ప్రధాని మోదీ ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది. ట్రయల్ రన్ అనంతరం తొలిసారిగా ప్రధాని ప్రయాణించే విమానం ల్యాండ్ కావడంతో అందరిలోనూ ఆనందం వ్యక్తమవుతోంది.
ప్రధానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రులు, తదితరులు స్వాగతం పలికారు. విమానాశ్రయం టెర్మినల్ భవనం వద్దకు చేరుకుని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. సుమారు 15 నిమిషాల పాటు టెర్మినల్ను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలను మోదీ పరిశీలించనున్నారు.
టెర్మినల్ సందర్శనలో భాగంగా చెక్-ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలను పరిశీలించనున్నారు. అరకు కాఫీ కియోస్క్ను సందర్శించి అరకు కాఫీని రుచి చూడనున్నారు. విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను ప్రధాని పరిశీలించనున్నారు. విమానాశ్రయ టెర్మినల్ నుంచి ఓపెన్టాప్ జీపులో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ సభకు హాజరుకానున్నారు. టెర్మినల్ నుంచి సభా వేదికకు వెళ్లే మార్గంలో వేలాది మంది గిరిజన మహిళలు ప్రదర్శించే థింసా సృత్యాన్ని వీక్షించనున్నారు.

