సోషల్ మీడియాలో కనిపించిన ఓ రీల్.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ.. చివరకు వారిని నకిలీ కరెన్సీ తయారీ, చలామణి చేసే ముఠాగా మార్చింది. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో వెలుగుచూసిన ఈ నకిలీ నోట్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. బిజినపల్లి పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేసి ముఠా గుట్టును రట్టు చేయడంతో.. ఈ కేసు ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించినట్లు వెలుగులోకి వచ్చింది. అసలు ఈ ముఠా ఎలా ఏర్పడింది? నకిలీ నోట్ల దందా ఎలా సాగింది? పోలీసులు ఎలా పట్టుకున్నారు? అనే ఆసక్తికర విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం

నాగర్ కర్నూల్ జిల్లాలో వెలుగుచూసిన నకిలీ నోట్ల ముఠా వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏపీ వరకు సాగిన నకిలీ కరెన్సీ నెట్వర్క్ను గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఈజీ మనీ కోసం ప్రయత్నించిన మంగనూరు గ్రామానికి చెందిన కురుమూర్తి, నవీన్ గౌడ్.. సోషల్ మీడియా వేదికగా నకిలీ కరెన్సీ కోసం వెతకడం ప్రారంభించారు.
ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్లో నకిలీ కరెన్సీకి సంబంధించిన ఓ రీల్ను చూసిన వారు.. అందులోని వ్యక్తులను సంప్రదించారు. అనంతరం ఏపీలోని భీమవరానికి చెందిన కొందరితో పరిచయం ఏర్పడింది. వారి ద్వారా అసలు నగదుకు నాలుగు రెట్లు విలువైన నకిలీ కరెన్సీ అందించే ఒప్పందం కుదుర్చుకున్నారు.
అందులో భాగంగా రూ.80 వేల విలువైన నకిలీ రూ.500 నోట్లను తెప్పించుకున్నారు. వాటిలో కొంత మొత్తాన్ని కురుమూర్తికి ఇచ్చారు. నకిలీ నోట్లను ఎవరూ గుర్తించలేరన్న ధీమాతో అతడు మంగనూరు గ్రామంలోని దాబాలు, కిరాణా దుకాణాలు, పెట్రోల్ బంకులు, వైన్ షాపుల్లో వాటిని చలామణి చేశాడు.
అయితే ఓ వైన్ షాపులో నకిలీ నోట్లను క్యాషియర్ కౌంటింగ్ మెషీన్లో తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడింది. నోట్లు నకిలీవని గుర్తించిన క్యాషియర్ వెంటనే బిజినపల్లి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడంతో నకిలీ నోట్ల వ్యవహారం ఏపీ వరకు విస్తరించిన విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు లభించడంతో మంగనూరులోని ఓ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. అక్కడ ఏడుగురు కలిసి ప్రత్యేక పేపర్, కలర్ ఫోటోకాపీ మెషీన్, కరెన్సీ కౌంటింగ్ మెషీన్ సాయంతో నకిలీ రూ.500 నోట్లను ముద్రిస్తున్నట్లు గుర్తించి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.68 వేల విలువైన నకిలీ కరెన్సీ నోట్లు, ఏడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. వారిలో ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నకిలీ కరెన్సీని తయారు చేయడం, రవాణా చేయడం, చలామణిలోకి తీసుకురావడం కోసం నిందితులు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.
అనుమానాస్పద కరెన్సీ నోట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. అలాగే సోషల్ మీడియాలో ‘ఈజీ మనీ’ పేరుతో వచ్చే అక్రమ ఆఫర్లను నమ్మవద్దని హెచ్చరించారు. మొత్తంగా ఇన్స్టాగ్రామ్లో మొదలైన పరిచయం.. నకిలీ నోట్ల దందాకు దారి తీసి చివరకు నిందితులను కటకటాల వెనక్కి నెట్టింది.

