
తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ వర్షాలు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయకపోతే రేషన్ నిలిచిపోతుందేమోనన్న ఆందోళనలో ఉన్న లబ్ధిదారులకు ఊరటనిస్తూ, e-KYC పూర్తి చేసే గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు చీఫ్ రేషనింగ్ అధికారి రాజిరెడ్డి వెల్లడించారు.
అంతేకాకుండా, వర్షాకాలంలో ప్రజలు తరచూ రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన ఇబ్బందిని తగ్గించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 1 నుంచి 31 వరకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఇంకా e-KYC పూర్తి చేయని లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. సమీపంలోని రేషన్ దుకాణాన్ని సంప్రదించి వెంటనే e-KYC ప్రక్రియ పూర్తి చేసుకోవడంతో పాటు, నిర్ణీత తేదీల్లో మూడు నెలల కోటా బియ్యాన్ని ఒకేసారి తీసుకెళ్లాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.

