
తిరుమల శ్రీవారి చెంత ఉన్న తిరుపతి జ్ఞాపకాల్లో నుంచి అలనాటి కట్టడం తొలగిపోనుంది. తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలో ఉన్న పాత రైల్వే స్టేషన్ భవనం కాలగర్భంలోకి వెళ్లిపోతోంది. పాత రైల్వే స్టేషన్ భవనం కు వీడ్కోలు పలుకుతూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. రైల్వే స్టేషన్ భవనం గురించి గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. వెంకన్న స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల్లో ఎక్కువశాతం రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. ప్రతి నిత్యం తిరుపతి రైల్వేస్టేషన్ భక్తులతో రద్దీగా ఉంటుంది.. అందుకే కేంద్రం అమృత్ భారత్ పథకం కింద తిరుపతి రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. త్వరలోనే ఆధునిక సౌకర్యాలతో రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. తిరుమల శ్రీవారు ఎంత ప్రసిద్ధో.. తిరుపతిలో పాత రైల్వే స్టేషన్ భవనం కూడా అందే ప్రసిద్ధి. ఇప్పుడు అలనాటి కట్టడం తిరుపతి జ్ఞాపకాల్లో నుంచి తొలగిపోతోంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ నెటిజన్ ఎమోషనల్ అయ్యారు.
తిరుపతిలో గోవిందరాజస్వామి గుడికి కూతవేటు దూరంలో ఉన్నపాత రైల్వే స్టేషన్ భవనం ఉంది. తిరుపతి స్థానిక ప్రజలకు ఈ రైల్వే స్టేషన్తో ఎంతో అనుబంధం ఉంది.. అలాగే తనకు కూడా ఈ స్టేషన్తో అనేక జ్ఞాపకాలు ఉన్నాయని కృష్ణవేణి అనే నెటిజన్ పోస్ట్ పెట్టారు. తన చిన్నతనంలో స్టేషన్కు దక్షిణం వైపు ఉండే గోవిందరాజు స్వామి సత్రాలలో జరిగే పెళ్లిళ్లకు వెళ్లాలంటే ఈ రైల్వే స్టేషన్ లోపల ఉండే సిమెంట్ బ్రిడ్జి గుండా దాటుకుని అటువైపుకి వెళ్లేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. పోర్లవీధిలోని తన ఇంటికి రైల్వే స్టేషన్ చాలా దగ్గరగా ఉండేదన్నారు. అర్ధరాత్రి సమయంలో తాను, తన ఫ్రెండ్స్ కలిసి టీ తాగాలన్నా, టిఫిన్ తినాలన్నా ఈ రైల్వే స్టేషన్ దగ్గరే తినేవాళ్లమని చెప్పుకొచ్చారు. తిరుపతి రైల్వే స్టేషన్ ఎంత ఫేమస్సో.. స్టేషన్ ఎదురుగా ఉండే మీసాలాయన కేరళ టీ అంగడి కూడా అంతే ఫేమస్ అన్నారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ కార్యాలయం స్థానంలో ఒకప్పుడు తమిళనాడుకు వెళ్లే బస్సుల బస్టాండ్ ఉండేదని చెప్పుకొచ్చారు.

