
మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో నిమ్మసాగు ఎక్కువగా ఉంది. మార్కాపురం, కనిగిరి, వైపాలెం, గిద్దలూరు, దర్శి, కొండేపి, కందుకూరు నియోజకవర్గాల్లో 4 వేల హెక్టార్లలో సాగుచేస్తుండగా.. కేవలం కనిగిరి ప్రాంతంలోనే 2 వేల హెక్టార్లు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం నిమ్మసాగుపై చూయించింది. ఆగస్టు రెండో వారం వస్తున్నా ఇప్పటి వరకు చినుకు జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడకపోతే నిమ్మ చెట్లు ఎండిపోయే ప్రమాదం ఉంది.
రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది పశ్చిమ ప్రకాశమే.. ప్రస్తుత మార్కాపురం జిల్లా. వ్యవసాయం మినహా మరేయితర పరిశ్రమలు లేని ఏకైక జిల్లా మార్కాపురం. వ్యవసాయం కూడా కేవలం వర్షాల మీద మాత్రమే ఆధారపడాలి. వర్షాలు పడితేనే ఇక్కడ ప్రజలకు పంటలైనా, నీళ్లైనా.. ఏదైనా వర్షమే ఆధారం. ఎలాంటి పంట కాల్వలు లేని జిల్లా కూడా మార్కాపురమే! గతేడాది మొంథా తుఫాను పుణ్యమా అంట వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు నిండి నీటికి ఇబ్బంది లేకుండా ఉంది. కానీ, ఈ ఏడాది ఆగస్టు మొదటి వారం గడుస్తున్నా కనీసం చినుకు కూడా లేదు. ఈ ఎల్నినో ప్రభావం రైతులపై ఎక్కువగా పడింది.
మార్కాపురం జిల్లాలో బోరు కింద పండించే పంటలు కంటే వర్షాల మీద ఆధారపడి పండేంచేవే ఎక్కువ. హార్టికల్చర్ కింద మాత్రం కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో నిమ్మ సాగు మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఇప్పుడు ఆ నిమ్మ సాగు కూడా ప్రమాదంలో పడింది. ఈ ప్రాంతం నుంచి బెంగళూరు, హైదరాబాద్కు నిమ్మకాయలు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. రోజుకు కొన్ని వందల బస్తాలను రైతులు ఎగుమతి చేస్తుంటారు.
గతేడాది మొంథా తుఫాను తర్వాత చెప్పుకోదగ్గ వర్షాలు ఇప్పటి వరకు నమోదుకాలేదు. ఎండలు ఎక్కువగా నమోదు కావడం, వర్షాలు లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటాయి. దాంతో కనిగిరి వ్యవసాయ సబ్ డివిజిన్ పరిధిలోని నిమ్మ తోటలు ఎండిపోతున్నాయంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

