
భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసే ఓ కీలక మౌలిక సదుపాయం. ప్రపంచంలోని విజయవంతమైన విమానాశ్రాయాల స్ఫూర్తితో భోగాపురం ముందుకు సాగాలి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ నగర విస్తరణకు తోడ్పడింది. కెంపేగౌడ ఎయిర్పోర్ట్ బెంగళూరును ప్రపంచ టెక్నాలజీతో అనుసంధానించింది. ఎయిర్పోర్ట్ సాయంతో సింగపూర్ కనెక్టివిటీని ఆర్థిక వ్యూహంగా మార్చుకుంటే.. భౌగోళికంగా కీలక స్థానంలో ఉన్న దుబాయ్.. ప్రపంచ వాణిజ్య కేంద్రంగా మారడానికి విమానాశ్రయం ఊతమిచ్చింది. ఇంచియాన్ విమానాశ్రయం చుట్టూ కొత్త ఆర్థిక నగరం ఏర్పాటైంది.
ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేవలం మరో విమానాశ్రయంగా కాకుండా, ఉత్తరాంధ్ర భవిష్యత్తును ప్రభావితం చేసే మౌలిక సదుపాయంగా చూడాలి. ప్రపంచంలో కొన్ని విమానాశ్రయాలు ఆయా ప్రాంతాల ఆర్థిక రూపురేఖలను మార్చాయి. దక్షిణ భారతదేశంలో హైదరాబాద్, బెంగళూరు ఆ దిశగా విజయవంతమైన ఉదాహరణలు కాగా.. సింగపూర్, దుబాయ్, దక్షిణ కొరియాలోని ఇంచియాన్ ప్రపంచ స్థాయి నమూనాలుగా నిలిచాయి. వాటి అనుభవాలు భోగాపురం విమానాశ్రయ భవిష్యత్ దిశను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.
“ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన ప్రతి విమానాశ్రయం వెనుక ఒకే సూత్రం కనిపిస్తుంది. మొదట విమానాశ్రయం నిర్మాణం చేపట్టడం. తర్వాత దాని చుట్టూ రహదారులు, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ కేంద్రాలు, విద్యా సంస్థలు, వాణిజ్య సేవలను క్రమంగా అభివృద్ధి చేయడం. అంటే రన్ వే నిర్మాణం ప్రారంభం మాత్రమే. దాని చుట్టూ ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అయ్యే వాతావరణం కల్పించడమే అసలు ప్రయాణం. భోగాపురం కూడా ఇప్పుడు అలాంటి మలుపు వద్ద నిలిచి ఉంది.”

