
ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం నకిలీ టీటీడీ సిఫార్సు లేఖలు కలకలం రేపుతున్నాయి. దళారులు మంత్రి పేరును దుర్వినియోగం చేస్తూ భక్తులను మోసం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే తిరుమల వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి.
ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం నకిలీ టీటీడీ సిఫార్సు లేఖలు జారీ వ్యవహారం కలకలం రేపింది. మంత్రి పేరుతో లేఖలు జారీ అవుతున్నాయని బాధితులు మంత్రి కార్యాలయం దృష్టికి తీసుకురావడంతో ఈ వ్యవహారం బయటపడింది. కొందరు వ్యక్తులు మంత్రి పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ సిఫారసు లేఖలు సృష్టిస్తున్నారని బాధితులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ లేఖల అంశంపై మంత్రి పీఏ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్బాబుకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీస్ కమిషనర్, నకిలీ లేఖల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఇలాంటి మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, నకిలీ సిఫారసు లేఖల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. టీటీడీ సిఫారసు లేఖల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు.
