
రష్యాలో విషాదం.. కొండను ఢీకొట్టి కూలిన సైనిక విమానం, 29 మంది మృతి
రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రక్షణ శాఖకు చెందిన సైనిక రవాణా విమానం కుప్పకూలి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం (ఏప్రిల్ 1, 2026) తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించింది. క్రిమియా ప్రాంతంలో రష్యా సైనిక ఏఎన్-26 విమానం కూలిపోయిందని వెల్లడించింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అందరూ అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం.
టాస్ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఆ విమానం ఒక కొండను ఢీకొని కుప్పకూలింది. మరోవైపు, జిన్హువా నివేదిక ప్రకారం, మంగళవారం రాత్రి క్రిమియా ద్వీపకల్పం మీదుగా షెడ్యూల్ ప్రకారం ప్రయాణిస్తున్న సమయంలో విమానంతో సంబంధాలు అకస్మాత్తుగా తెగిపోయాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమై ఉండొచ్చని, ఇతర బాహ్య కారణాలు లేవని భావిస్తున్నారు.
రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొన్నదాని ప్రకారం, “మార్చి 31 సాయంత్రం మాస్కో సమయం ప్రకారం సుమారు 6 గంటల సమయంలో క్రిమియా ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న ఏఎన్-26 విమానంతో సంబంధాలు కోల్పోయాం” అని తెలిపింది. అనంతరం గాలింపు బృందాలు ప్రమాద స్థలాన్ని గుర్తించి, సహాయక చర్యలు చేపట్టాయి. అయితే, విమానంలో ఉన్న వారిలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని స్పష్టం చేసింది.
ఏఎన్-26 అనేది పాత తరానికి చెందిన తేలికపాటి సైనిక రవాణా విమానం. ఇది తక్కువ, మధ్యదూర ప్రయాణాలకు ఉపయోగపడుతూ సుమారు 40 మంది ప్రయాణికులను లేదా సరుకును మోసుకెళ్లగలదు.
గత ఏడాది డిసెంబర్లో కూడా రష్యా ఇలాంటి విషాదాన్ని ఎదుర్కొంది. డిసెంబర్ 9న మాస్కోకు తూర్పున ఉన్న ఇవనోవో ప్రాంతంలో ఆంటోనోవ్ ఆన్-22 విమానం పరీక్షా ప్రయాణం సమయంలో కూలిపోయింది. మరమ్మతుల అనంతరం టెస్ట్ ఫ్లైట్ నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఏడుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రష్యా సైనిక విమానయాన రంగానికి గణనీయమైన నష్టం కలిగించింది.

