ఇంటి పెరట్లోనూ, బాల్కనీ కుండీల్లోనూ గులాబీ మొక్కలను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. అయితే మొక్కలకు కొత్త చిగుర్లు రాకపోవడం, ఏర్పడిన చిన్న మొగ్గలు మాడిపోయి రాలిపోవడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో మట్టిలో తేమ ఎక్కువగా ఉండటంతో ఫంగస్, వివిధ తెగుళ్లు సోకి గులాబీ మొక్కలు బలహీనపడి ఎండిపోయే అవకాశం ఉంటుంది.

మార్కెట్లో లభించే రసాయన ఎరువులను అధికంగా ఉపయోగిస్తే మొక్కలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కొద్దిరోజులు పూలు పూసిన తర్వాత మొక్క బలహీనపడకుండా ఉండాలంటే సహజసిద్ధమైన పోషకాలను అందించడం మంచిది. ముఖ్యంగా ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే సీజన్లో వంటింట్లో సులభంగా లభించే పదార్థాలతోనే మొక్కలకు అవసరమైన పోషకాలను అందించే సహజ ఎరువును తయారు చేసుకోవచ్చు. ఎలాంటి రసాయనాలు లేకుండా ఈ ఎరువును ఎలా తయారు చేసి, మొక్కలకు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గులాబీ మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే కొన్ని ముఖ్యమైన పోషకాలు అవసరం. వేర్లు బలంగా, దృఢంగా అభివృద్ధి చెందేందుకు కాల్షియం, కొత్త చిగుర్లు మరియు ఆకులు వేగంగా పెరగడానికి నైట్రోజన్ కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే వర్షాకాలంలో మట్టిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఫంగస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే మొక్కను ఫంగస్ నుంచి రక్షించేందుకు తగిన యాంటీ ఫంగల్ పదార్థాలను కూడా ఉపయోగించడం ప్రయోజనకరం.
కాల్షియం కోసం ఉడకబెట్టని పచ్చి గుడ్ల పెంకులను ముందుగా శుభ్రంగా కడిగి, రెండు రోజుల పాటు బాగా ఎండబెట్టాలి. ఆ తర్వాత రెండు గుప్పెళ్ల ఎండిన గుడ్ల పెంకులను తీసుకోవాలి. యాంటీ-ఫంగల్ లక్షణాల కోసం ఒక గుప్పెడు మెంతులను కలపాలి. మెంతులు మట్టిలో ఫంగస్, హానికర సూక్ష్మజీవుల పెరుగుదలను తగ్గించడంలో సహాయపడటంతో పాటు వేర్ల ఆరోగ్యానికి తోడ్పడతాయి.
సహజ ఎరువు తయారీ విధానం
తర్వాత నైట్రోజన్ కోసం రెండు చెంచాల కాఫీ పొడి లేదా ఉపయోగించిన టీ పొడిని కలపాలి. ఇది గులాబీ మొక్కలో కొత్త చిగుర్లు ఆరోగ్యంగా, బలంగా పెరగడానికి సహాయపడుతుంది. అనంతరం అన్ని పదార్థాలను మిక్సీ జార్లో వేసి, తేమ లేకుండా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. చివరగా ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో వేసి భద్రపరచుకోవాలి. సరిగ్గా పొడిగా ఉంచితే దీన్ని కొంతకాలం నిల్వ చేసుకోవచ్చు.
ఎరువును మొక్కలకు వేసే విధానం
కుండీలో లేదా నేలలో పెరుగుతున్న మొక్క మొదలుకు కొద్దిగా దూరంగా మట్టిని లూజ్ చేయాలి. కుండీలో పెంచే మొక్కకు సుమారు ఒకటిన్నర టీస్పూన్, నేలలో పెరిగే పెద్ద మొక్కకు రెండు నుంచి మూడు టీస్పూన్ల ఎరువు పొడిని మట్టిలో వేసి, పై నుంచి మట్టితో కప్పాలి. అనంతరం మొక్కకు సరిపడా నీటిని అందించాలి.
ఈ సహజ ఎరువును వారానికి లేదా పది రోజులకు ఒకసారి వేస్తూ ఉంటే మొక్క ఆరోగ్యంగా పెరిగి, కొమ్మకొమ్మకు మొగ్గలు వచ్చేలా సహాయపడుతుంది. అలాగే పూలు మంచి పరిమాణంలో వికసించే అవకాశం ఉంటుంది. కుండీలను రోజుకు కనీసం రెండు నుంచి మూడు గంటల పాటు సూర్యరశ్మి అందే ప్రదేశంలో ఉంచడం కూడా ముఖ్యం. ఈ సులభమైన సహజ పద్ధతులను పాటిస్తే గులాబీ మొక్కలు సీజన్ మొత్తం పూలతో కళకళలాడేలా పెంచుకోవచ్చు.

