
ముంబై బాంద్రా బ్యాండ్స్టాండ్ వద్ద సముద్రాన్ని చూస్తూ ఉండే ‘మన్నత్’ అంటే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గుర్తుకొస్తారు. అభిమానులకు ఇది కేవలం ఓ సెలబ్రిటీ ఇల్లు కాదు.. షారుఖ్ కలలు, కష్టాలు, విజయాలకు ప్రతీకగా నిలిచిన ఐకానిక్ ప్రాపర్టీ.
ప్రస్తుతం ‘మన్నత్’ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంటి వెనుక భాగంలో అదనంగా రెండు అంతస్తులు నిర్మించడంతో పాటు రీనోవేషన్ పనులు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ పనులకు దాదాపు రూ.25 కోట్లు ఖర్చవుతుందని నివేదికలు చెబుతున్నాయి.
తాత్కాలికంగా మరో ఇంటికి షిఫ్ట్
రీనోవేషన్ పనుల కారణంగా షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, వారి పిల్లలు ఆర్యన్, సుహానా, అబ్రామ్ తాత్కాలికంగా బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలోని లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్లకు మారినట్లు తెలుస్తోంది.
‘విల్లా వియన్నా’ నుంచి ‘మన్నత్’ వరకు..
మన్నత్ కథ 1997లో మొదలైంది. అప్పట్లో ‘యెస్ బాస్’ షూటింగ్ కోసం షారుఖ్ ఈ భవనం వద్దకు వెళ్లేవారు. ఆ సమయంలో దీనిని ‘విల్లా వియన్నా’ అని పిలిచేవారు. షూటింగ్ సమయంలో అక్కడి వాచ్మన్ తమను వెళ్లిపోవాలని చెప్పడంతో.. ఎప్పటికైనా ఈ ఇంటిని కొనుగోలు చేయాలని షారుఖ్ సరదాగా అన్నారట.
ఆ మాట కొన్నేళ్లకే నిజమైంది. 2001లో షారుఖ్ ఈ ఆస్తిని సుమారు రూ.13 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఇంటిని కొనుగోలు చేసిన తర్వాత దాన్ని తన కలల భవనంగా తీర్చిదిద్దే బాధ్యతను గౌరీ ఖాన్ తీసుకున్నారు. ఇంటీరియర్ డిజైన్పై గౌరీకి ఉన్న ఆసక్తిని ప్రోత్సహించిన షారుఖ్.. ఆమెతోనే మన్నత్ను డిజైన్ చేయించారు. ఆ అనుభవమే తర్వాత గౌరీ ఖాన్ను ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్గా నిలబెట్టింది.
ఇప్పుడు విలువ రూ.300 కోట్లు!
ఒకప్పుడు భారీ కష్టాలతో కొనుగోలు చేసిన మన్నత్ విలువ ఇప్పుడు సుమారు రూ.300 కోట్ల వరకు ఉంటుందని నివేదికలు పేర్కొంటున్నాయి. రెండు దశాబ్దాల్లో ఈ ఆస్తి విలువ భారీగా పెరిగింది.
ఒకప్పుడు షూటింగ్ కోసం వెళ్లిన ఇంటినే సొంతం చేసుకున్న షారుఖ్.. ఇప్పుడు అదే మన్నత్ను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే మన్నత్ ఆయనకు కేవలం ఓ ఇల్లు కాదు.. తన కలను నిజం చేసుకున్న విజయానికి గుర్తుగా నిలిచింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ 2026 డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది.

