
వినాయకుడికి ఇష్టమైన ఆహారమైన కుడుములను ఇకపై కాణిపాకంలో ప్రసాదంగా పెట్టనున్నారు. ఇంతకాలం లడ్డూ, పులిహోర, వడను ప్రసాదంగా అందిస్తున్న ఆలయ అధికారులు ఇకపై కుడుములను కూడా అందులో చేర్చాలని నిర్ణయించారు. ఈ మేరకు పాలక మండలి సభ్యులు ఆమోదం తెలిపినట్లు ఛైర్మన్ వి. మణినాయుడు తెలిపారు. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు స్వామి వార వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు, ఆహ్వాన పత్రికలను సీఎం, డీసీంకు అందజేయనున్నట్లు తెలిపారు.
వినాయకుడి పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది ఆయనకు ఇష్టమైన ఆహార పదార్థాలు. అందులో ఉండ్రాళ్లు, కుడుములు అంటే ఆ గణనాథునికి చాలా ఇష్టం. మరి ఆయను అంతప్రీతియయిన ఆహారాన్ని భక్తులకు అందించాలి కదా. అందుకే కాళిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ పాలకమండలి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వినాయకుడికి ఇష్టమైన మోదక ప్రసాదం అదే కుడుములను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
కాణిపాకం ఆలయంలో ప్రస్తుతం లడ్డూ, వడ, పులిహోర అందిస్తున్నామని ఇకపై కుడుములు కూడా అందుబాటులోకి తీసుకువచ్చేలా తీర్మానించినట్లు పాలకమండలి ఛైర్మన్ వి. మణినాయుడు తెలిపారు. పత్రినెలా సంకటహర చతుర్థి సందర్భంగా ఆలయంలో నిర్వహించే స్వర్ణ రథోత్సవ సేవలో పాల్గొనే భక్తులు ఇకపై రూ. 5 వేలు చెల్లించాలని పాలక మండలి నిర్ణయించింది. క్యూ లైన్లు, మాడవీధుల్లో భక్తులకు తాగునీరు, సౌకర్యాలు కల్పించే సిబ్బంది నియామకానికి కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయని ఆయన తెలిపారు.
సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికలకు సభ్యులు ఆమోదం తెలిపారు. దీనిలో భాగంగా సుమారు 21 పనులకు సభ్యుల నుంచి ఆమోదం లభించినట్లు వి. మణినాయుడు తెలిపారు. ఆహ్వాన పత్రికలను సీఎం, డిప్యూటీ సీఎంలకు అందజేసి ఆహ్వానిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ సాగర్ బాబు, ఇన్చార్జి ఈఈ సతీష్, అధికారులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు

