
విజయనగరం జిల్లాలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. ఆగస్ట్ ఒకటో తేదీన భోగాపురం విమానాశ్రయం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో విమానాశ్రయం ప్రత్యేకతలు, డిజైన్ గురించి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో భోగాపురం విమానాశ్రయం టెర్మినల్ డిజైన్ను.. ఎగిరే చేప ఆకృతిలో ఎందుకు నిర్మించారనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
భోగాపురం ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతం.. సముద్రతీర ప్రాంతం. బంగాళాఖాతానికి ఆనుకుని ఉంది. ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్కృతి, తీర ప్రాంత ప్రాముఖ్యత, మత్స్య సంపద అంతర్జాతీయ స్థాయిలో ప్రతిబింబించేలా ఫ్లైయింగ్ ఫిష్ డిజైన్ ఎంచుకున్నారు. సముద్ర చేప ‘ఎక్సోకోయేటస్’ను ఫ్లయింగ్ ఫిష్గా పిలుస్తారు. ఈ చేప నీటిలో ఈదుతూనే పొడవైన రెక్కల సాయంతో నీటి ఉపరితలం నుంచి గాల్లోకి ఎగిరి ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆ రకంగా నీరు, ఆకాశాన్ని కలిపే సంకేతంగా కనిపిస్తుంది. విమానాలు కూడా నేల మీద నుంచి ఆకాశంలోకి ఎగిరి ప్రయాణిస్తాయి. ఈ క్రమంలోనే విమానయానాన్ని, బంగాఖాఖాతం మత్స్యసంపదను ప్రతిబింబించేలా ఈ ఫ్లైయింగ్ ఫిష్ డిజైన్ ఎంచుకున్నారు.
ఎగిరే చేప తరహాలో.. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా పర్యాటకం, ఎగుమతుల రంగంలో దూసుకెళ్లాలనే ఆకాంక్షకు కూడా ఈ ఫ్లైయింగ్ ఫిష్ డిజైన్ ఓ కారణంగా భావించవచ్చు. ఇక భోగాపురం (అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం) ఎయిర్ పోర్టు.. టెర్మినల్ సీలింగ్ కూడా సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా.. రంగవల్లులలో ఏర్పాటు చేశారు. భోగాపురం తీర ప్రాంతం కావడంతో తుఫానులు, ఈదురుగాలుల ప్రభావం ఎక్కువ. ఈ నేపథ్యంలో వీటిని తట్టుకునేలా 21 మీటర్ల గ్లాస్ ఫాసాడ్ నిర్మాణం, అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి టెర్మినల్ నిర్మించారు.

