
తెలంగాణలో వంటగ్యాస్ వినియోగదారులకు ఈ-కేవైసీ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఆగస్టు 16 వరకు గడువు ఉన్నప్పటికీ, కేవైసీ లేనివారి బుకింగ్స్ ఆగస్టు 1 నుంచే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతున్నాయి. దీంతో వృద్ధులు, విదేశాల్లో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే బోగస్ కనెక్షన్ల ఏరివేతకే ఈ ప్రక్రియ అని, ఇప్పటికే పూర్తి చేసినవారు మళ్లీ చేయాల్సిన పనిలేదని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. డెలివరీ బాయ్ యాప్ లేదా ఆన్లైన్ ద్వారా కేవైసీ పూర్తి చేసుకోవచ్చని సూచించాయి.
వంటగ్యాస్ వినియోగదారుల్లో ఈ-కేవైసీ ప్రక్రియపై తీవ్ర గందరగోళం, ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ-కేవైసీ పూర్తి చేయడానికి ఆగస్టు 16 వరకు తుది గడువును ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అనేక ప్రాంతాల్లో ఆగస్టు 1 నుంచే సిలిండర్ల పంపిణీ నిలిచిపోతుండటంతో సామాన్య వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవైసీ ప్రక్రియ పూర్తికానివినియోగదారులు సిలిండర్ కోసం బుకింగ్ చేసుకోవడానికి ప్రయత్నించగా.. సిస్టమ్లోనే అవి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతున్నాయని గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఉపాధి, చదువుల నిమిత్తం విదేశాల్లో ఉంటున్నవారు, వయోభారంతో వేలిముద్రలు పడని వృద్ధులు ఈ కఠిన నిబంధనల వల్ల తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఈ పరిస్థితిపై ఆయిల్ కంపెనీల అధికారులు స్పష్టతనిస్తూ వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేశారు. గతంలోనే ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినవారు మళ్లీ చేయాల్సిన పనిలేదని అధికారులు స్పష్టం చేశారు. మార్కెట్లో ఉన్న బోగస్ గ్యాస్ కనెక్షన్లను పూర్తిగా ఏరివేయడంతో పాటు గృహ వినియోగానికి ఉద్దేశించిన రాయితీ సిలిండర్లు హోటళ్లు, ఇతర వాణిజ్య అవసరాలకు అక్రమంగా మల్లకుండా అడ్డుకోవడానికే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా వారు వివరించారు. అర్హులైన ప్రతి వినియోగదారునికి సేవలు అందుతాయని హామీ ఇచ్చారు.
ఇంకా ఈ-కేవైసీ పూర్తికాని వినియోగదారులు ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం పలు సులువైన మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు నేరుగా తమ పరిధిలోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి వేలిముద్రల ద్వారా లేదా సిలిండర్ ఇంటికి తెచ్చే డెలివరీ బాయ్ మొబైల్ యాప్ సహాయంతో ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా ఈ- కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏజెన్సీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సంబంధిత ఆయిల్ కంపెనీల అధికారిక మొబైల్ యాప్లలో లాగిన్ అయి ఆన్లైన్ ద్వారా కూడా అత్యంత సులువుగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. త్వరగా ఈ- కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని లేదంటే సిలిండర్ బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సుందని చెబుతున్నారు.

