
తిరుమలలో చాలా రోజుల తర్వాత స్వామివారికి ఒక్కరోజులో భారీగా ఆదాయం సమకూరింది. ప్రతి రోజూ సాధారణంగా రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. భక్తుల రద్దీ ఉన్న సమయంలో రూ.5 కోట్లు దాటి రూ.6 కోట్ల వరకు ఆదాయం పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో రూ.5 కోట్లలోపే ఆదాయం వస్తుండగా.. చాలా రోజుల తర్వాత ఏకంగా రూ.5 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది.
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. గత నాలుగు నెలలుగా భక్తులు రద్దీ కొనసాగుతోంది.. వాస్తవానికి జూన్ నెల రెండోవారం వరకు రద్దీ కొనసాగి ఆ తర్వాత రద్దీ సాధరణంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.. జూన్, జులై, ఆగస్టు నెలల్లో కూడా రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని ప్రతి రోజు 60 వేల నుంచి 90 వేలమందికి వరకు భక్తులు దర్శించుకుంటున్నారు. తిరుమలలో రద్దీ పెరగడంతో స్వామివారి హుండీకి రోజువారీ ఆదాయం పెరిగింది. దాదాపు నెల తర్వాత శ్రీవారికి భారీగా ఆదాయం సమకూరింది.
తిరుమల శ్రీవారిని బుధవారం 77,502మంది భక్తులు దర్శించుకోగా.. 34,485మంది తనీలాలు సమర్పించారు. బుధవారం హుండీ కానుకలు రికార్డు స్థాయిలో రూ.5.46 కోట్లు సమకూరాయి. లడ్డూ ప్రసాదాలు 4.24 లక్షలు విక్రయించగా.. 2.50 లక్షలమంది అన్నప్రసాదాలు స్వీకరించారు. ప్రస్తుతం తిరుమలలో కంపార్ట్మెంట్లు అన్ని నిండి శిలా తోరణం వరకు క్యూ లైన్ ఉంది.. సర్వ దర్శనం టోకెన్లు లేని భక్తులకు దర్శనం చేసుకునేందుకు 20 నుంచి 24 గంటల సమయం పడుతోంది. జూన్ నెల 29వ తేదీ స్వామివారి హుండీకి రూ.5.63 కోట్లు విరాళంగా వచ్చింది.. ఆ తర్వాత బుధవారం (ఆగస్టు 8న) రూ.5.46 కోట్ల ఆదాయం వచ్చింది. అంతేకాదు జులై నెలలో టీటీడీ చరిత్రలోనే నెలవారీ హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో సమకూరింది. జులై నెలలో స్వామి వారికి రూ.140.28 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. టీటీడీ చరిత్రలోనే ఇది అత్యధిక నెలవారీ హుండీ ఆదాయం కావడం విశేషం. జులై నెలలో స్వామివారిని 24.52 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.
మరోవైపు తిరుమలలో 4 నెలలుగా భక్తుల రద్దీ పెరగడంతో.. ఇటు లడ్డూల విక్రయాలు కూడా భారీగా పెరిగాయి. టీటీడీ గడిచిన 4 నెలల్లో ఏకంగా 4కోట్ల 90లక్షల 99వేల 781 లడ్డూలను భక్తులకు విక్రయించింది. అంటే టీటీడీ రోజుకు దాదాపు 4 లక్షల నుంచి 4.50 లక్షల వరకు లడ్డూలను తయారుచేసి భక్తులకు అందించింది. మార్చి నెల నుంచి రద్దీ పెరుగుతుందనే అంచనాతో టీటీడీ అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీని గనమిస్తూ అందుకు అనుగుణంగా లడ్డూల తయారీని పెంచింది. నెలల వారీగా చూస్తే.. ఏప్రిల్లో 1.11 కోట్లు, మేలో 1.21 కోట్లు, జూన్లో 1.26 కోట్లు, జులైలో అత్యధికంగా 1.30 కోట్ల లడ్డూల్ని భక్తులు కొనుగోలు చేశారు. మొత్తం మీద తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో.. గత నాలుగు నెలలుగా టీటీడీకి భారీగా ఆదాయం వస్తోంది.

