
అమరావతి, ఆగస్టు 07: విజయ డెయిరీ చైర్మన్ ఎన్నిక వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం సీరియస్ అయింది. చైర్మన్ ఎన్నిక ఆలోచించి చేద్దామన్న అధిష్ఠానం సూచనను చలసాని ఆంజనేయులు ధిక్కరించారు. పార్టీ అధిష్ఠానం సూచనలు బేఖాతరు చేస్తూ ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
ఈ నామినేషన్ను ఉపసంహరించుకోవాలంటూ ఆయనను పార్టీ ఆదేశించింది. దీనిని ఆయన ధిక్కరించారు. ఈ నేపథ్యంలో పార్టీ కావాలో? పదవి కావాలో? తెల్చుకోవాలనంటూ చలసాని ఆంజనేయులకు అధిష్ఠానం తేల్చి చెప్పింది. తనకు కొంత సమయం ఇస్తే నిర్ణయం చెబుతానని అధిష్ఠానానికి తెలిపారు.
సమయం ఇవ్వడం కుదరదంటూ చలసాని ఆంజనేయులకు అధిష్ఠానం కుండబద్ధలు కొట్టింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు పార్టీకి ఆయన తెలియజేశారు. అనంతరం ఆసుపత్రిలో చేరినట్లు పార్టీ అధిష్ఠానానికి ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు (శుక్రవారం) విజయ డెయిరీ డైరెక్టర్లతో మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి సమావేశం కానున్నారు.

