
రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు, కర్నూలు జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు వేర్వేరు హత్య ఘటనలు స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించాయి. పల్నాడు జిల్లా రెంటచింతలలో వైసీపీ నేత నవులూరి చెన్నారెడ్డి దారుణ హత్యకు గురికాగా.. కర్నూలులో టీడీపీ కార్యకర్త షేక్ ఇంతియాజ్ బాషా హత్యకు గురయ్యారు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
రెంటచింతలలో వైసీపీ నేత దారుణ హత్య:
పల్నాడు జిల్లా రెంటచింతలలో వైసీపీ నేత నవులూరి చెన్నారెడ్డి హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన గొంతు కోసి హత్య చేసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. రెంటచింతల నుంచి రెంటాల వెళ్లే మార్గంలో పులోళ్ల బావి సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న రెంటచింతల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యకు దారితీసిన కారణాలు, నిందితుల వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.
కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య:
ఇక కర్నూలులో టీడీపీ కార్యకర్త షేక్ ఇంతియాజ్ బాషా (37) హత్యకు గురయ్యారు. మాసుంబాషా దర్గా సమీపంలో టీడీపీకి చెందిన షేక్ జవాజ్, వైసీపీకి చెందిన ఇర్ఫాజ్తో ఇంతియాజ్కు ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జవాజ్, ఇర్ఫాజ్ కలిసి ఇంతియాజ్పై రాళ్లతో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇంతియాజ్ అక్కడికక్కడే మృతి చెందారు.
డబ్బుల వ్యవహారంలో ఇంతియాజ్కు, జవాజ్-ఇర్ఫాజ్లకు మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఇర్ఫాజ్ గతంలో ఓ బంగారు వ్యాపారి హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు సమాచారం.
పల్నాడు, కర్నూలు జిల్లాల్లో చోటుచేసుకున్న ఈ రెండు హత్యలు స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీశాయి. రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులు హత్యకు గురికావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరు ఘటనల్లోనూ హత్యలకు దారితీసిన పరిస్థితులు, నిందితుల పాత్ర, రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

