పెదకూరపాడులో వృద్ధ దంపతులపై దుండగులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఆధార్ కార్డు వెరిఫికేషన్ పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు యువకులు సుత్తితో దాడి చేసి, వృద్ధురాలిని హతమార్చారు. భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి, సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు..

గుంటూరు, ఆగస్ట్ 6: పల్నాడు జిల్లా పెదకూరపాడులో వృద్ధ దంపతులపై జరిగిన దారుణ దాడి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆధార్ కార్డు వెరిఫికేషన్ పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు యువకులు వృద్ధ దంపతులపై దాడి చేసి, వృద్ధురాలిని హత్య చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
పెదకూరపాడులోని దామచర్లపాలెంలో నివాసముంటున్న అవ్వారి బాలగురవయ్య, అరుణ దంపతుల ఇంటికి ఉదయం సుమారు 11.30 గంటల సమయంలో ఇద్దరు యువకులు వచ్చారు. ఆధార్ కార్డు చూపించాలని బాలగురవయ్యను కోరగా, అరుణ ఇంట్లోకి వెళ్లి ఆధార్ కార్డు తీసుకురావడానికి ప్రయత్నించారు. అదే సమయంలో నిందితులు బాలగురవయ్యపై సుత్తితో దాడి చేశారు.
భర్త కేకలు విని అరుణ బయటకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయగా, నిందితులు ఆమె గొంతు కోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అరుణ ఇంటి బయటకు పరుగెత్తుకుంటూ వచ్చి కుప్పకూలగా, అక్కడికక్కడే మృతి చెందింది. బాలగురవయ్య అరుపులు విని స్థానికులు సంఘటన స్థలానికి చేరుకునేలోపే దుండగులు పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న బాలగురవయ్యను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆస్పత్రిలో ఉన్న బాలగురవయ్య తన భార్య పరిస్థితి గురించి పదేపదే అడగడం అక్కడున్న వారిని కలచివేసింది. అయితే అరుణ మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులు ఆయనకు ఇంకా తెలియజేయలేదు.
సమాచారం అందుకున్న సత్తెనపల్లి డీఎస్పీ కృష్ణ చైతన్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రాథమిక విచారణలో ఇటీవల ఈ దంపతులు భూములు విక్రయించి పెద్ద మొత్తంలో నగదు పొందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సంబంధాలు సహా అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. బంధువుల ప్రమేయం కూడా ఉండొచ్చనే అనుమానాలతో దర్యాప్తు సాగుతోంది. మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తూ, నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని అధికారులు వెల్లడించారు.

