రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తత్కాల్ టికెట్ల బుకింగ్స్లో నూతన మార్పులు చేసింది. ఇక నుంచి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ముందు చేరుకోవాల్సి ఉంటుంది. ముందే వచ్చి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాలు చూస్తే.

ముందుగానే టోకెన్ జారీ
రైల్వే కౌంటర్ల వద్ద ముందుగా ఒక టోకెన్ తీసుకోవాలి. ఆ తర్వాత టోకెన్ నంబర్ ప్రకారం వారిని టిక్కెట్ కౌంటర్కు పిలుస్తారు. మీ టోకెన్ వచ్చినప్పుడు వెళ్లి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏసీ, నాన్ ఏసీ స్లీపర్ తత్కాల్ టిక్కెట్ల కోసం వేర్వేరు టోకెన్ల టైమింగ్స్ అమలు చేస్తున్నారు. ఏసీ తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రయాణికులకు ఉదయం 8:30 నుండి 9 గంటల మధ్య టోకెన్లు జారీ చేస్తారు. నాన్ ఏసీ లేదా స్లీపర్ తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టిక్కెట్ల కోసం టోకెన్ల పంపిణీ ఉదయం 9:30 నుండి 10 గంటల మధ్య జరుగుతుంది. మీరు ఏసీ తత్కాల్ టిక్కెట్ పొందాలనుకుంటే ముందుగా స్టేషన్కు సమయానికి చేరుకుని మీ టోకెన్ను తీసుకోవాలి. టిక్కెట్ బుకింగ్ ప్రారంభమైనప్పుడు కౌంటర్ల వద్ద అకస్మాత్తుగా పెరిగే రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎన్ని టోకెన్లు జారీ చేస్తారంటే..?
ఇక ప్రతి బుకింగ్ కౌంటర్ నుండి జారీ చేయాల్సిన టోకెన్ల సంఖ్యను కూడా రైల్వేశాఖ నిర్ణయించింది. ఏసీ తత్కాల్ టిక్కెట్ల కోసం గరిష్టంగా 10 టోకెన్లు జారీ చేస్తారు. నాన్-ఏసీ స్లీపర్ తత్కాల్ టిక్కెట్ల కోసం ఒక కౌంటర్ నుండి గరిష్టంగా 15 టోకెన్లు జారీ చేస్తారు. దీనివల్ల తమకు టిక్కెట్ బుక్ చేసుకునే అవకాశం లభిస్తుందో లేదో ప్రయాణికులు ముందుగానే తెలుసుకోగలుగుతారు.

