
బాపట్ల జిల్లా చీరాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పర్యటించనున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అందించనున్న ఆర్థిక సహాయాన్ని సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. ‘నేతన్న సేవలో’ పథకం కింద ప్రతి చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 71,536 చేనేత కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.179 కోట్ల నిధులను కేటాయించింది.
చేనేత రంగానికి మరింత ప్రోత్సాహం అందించడంతో పాటు నేతన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చేనేత కుటుంబాలతో నేరుగా మాట్లాడి.. వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకోనున్నారు.
సీఎం చంద్రబాబు ఉదయం 10.30 గంటలకు తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి.. 10.50 గంటలకు వేటపాలెం మండలం కొత్తపేట గ్రామానికి చేరుకోనున్నారు. అనంతరం ఉదయం 11.05 గంటలకు ప్రజావేదికలో జరిగే సభకు హాజరై ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

