
మార్కాపురం జిల్లా సీఎస్పురం మండలం డీజీపేటలో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆగస్టు 13న గేదెలకు మేత కోసం పొలానికి వెళ్లిన పావలి వెంకట సుబ్బమ్మపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఆమె మెడలోని బంగారు గొలుసు, చెవి కమ్మలు, బుట్టలు తీసుకుని పరారయ్యాడు.
ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న మార్కాపురం జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. వివిధ కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు అదే గ్రామానికి చెందిన పావలి సురేష్పై అనుమానం వ్యక్తం చేసి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సురేష్ హత్య చేసింది తానేనని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2024 సెప్టెంబర్ 20న గడ్డి కోసం పొలానికి వెళ్లిన డేగా రత్తమ్మ అనే మరో మహిళను కూడా ఇదే తరహాలో హత్య చేసి బంగారం దోచుకున్నట్లు సురేష్ అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఒంటరిగా పొలాలకు వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారు ఎవరూ లేని సమయంలో దాడి చేసి హత్య అనంతరం వారి ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకునేవాడినని నిందితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. రెండు కేసులకు సంబంధించిన దోపిడీ సొత్తుతో పాటు హత్యకు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన మార్కాపురం ఓఎస్డీ నవజ్యోత్ మిశ్రా, కనిగిరి ఇన్ఛార్జి డీఎస్పీ పి. శ్రీధర్తో పాటు దర్యాప్తు బృందాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు.

