
దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న 8.7 కోట్లకు పైగా యువత చదువు, ఉద్యోగం లేదా నైపుణ్య శిక్షణకు దూరంగా ఉన్నట్లు నీతి ఆయోగ్ తాజా నివేదిక వెల్లడించింది. తక్కువ ఆదాయ కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు, విద్యా ఖర్చుల భారం, ప్రైవేట్ ట్యూషన్లపై అధిక వ్యయం, అలాగే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో నైపుణ్యాల అభివృద్ధి లేకపోవడం వంటి అంశాలు యువత ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నాయని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా, దేశంలోని గ్రాడ్యుయేట్లలో కేవలం 8.25 శాతం మందికే తమ విద్యార్హతలకు తగిన ఉద్యోగాలు లభిస్తున్నాయని తెలిపింది.
దేశంలోని యువత పరిస్థితిపై నీతి ఆయోగ్ తాజా నివేదిక ఆందోళనకర అంశాలను వెల్లడించింది. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న 8.7 కోట్లకు పైగా యువత ప్రస్తుతం చదువు, ఉద్యోగం లేదా నైపుణ్య శిక్షణలో లేరని పేర్కొంది. వీరిని ‘నీట్ యూత్’ (Not in Education, Employment or Training)గా నిర్వచించింది. ‘రిమైనింగ్ స్కిల్లింగ్ ఫర్ వికసిత్ భారత్@2047’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను ప్రస్తావించింది.
2021లో నిర్వహించిన 78వ జాతీయ శాంపిల్ సర్వే డేటాను ఆధారంగా చేసుకుని ఈ అంచనాలను రూపొందించినట్లు నీతి ఆయోగ్ తెలిపింది. దేశంలో 15-29 ఏళ్ల వయసున్న యువతలో గణనీయమైన సంఖ్యలో విద్య, ఉపాధి, నైపుణ్య శిక్షణకు దూరంగా ఉన్నారని నివేదిక వెల్లడించింది. యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అందించకపోతే రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు మరింత సవాలుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది.
ముఖ్యంగా తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని నీతి ఆయోగ్ పేర్కొంది. కాలేజీ ఫీజులు, ప్రైవేట్ ట్యూషన్లు, ఇతర విద్యా ఖర్చులు వారి కుటుంబాలపై అదనపు భారాన్ని మోపుతున్నాయని తెలిపింది. ఈ పరిస్థితులు యువత విద్యను కొనసాగించడం, నైపుణ్యాలు పెంపొందించుకోవడం, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ప్రభావం చూపుతున్నాయని నివేదిక వివరించింది.
సంప్రదాయ డిగ్రీ విద్యతో పాటు అదనంగా ఖరీదైన నైపుణ్యాభివృద్ధి కోర్సులు చేయడం చాలామంది యువతకు ఆర్థికంగా భారంగా మారుతోందని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. డిగ్రీ పూర్తయ్యాక కుటుంబ బాధ్యతలను నిర్వర్తించేందుకు కొందరు తక్కువ వేతనాలకైనా ఉద్యోగాల్లో చేరుతున్నారని, మరికొందరు తమ విద్యకు తగిన ఉద్యోగాలు దొరకక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని నివేదిక విశ్లేషించింది.
ఉన్నత విద్య పూర్తి చేసిన యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు ఆశించిన స్థాయిలో లేవని నీతి ఆయోగ్ వెల్లడించింది. కేవలం 8.25 శాతం మంది గ్రాడ్యుయేట్లకే తమ విద్యార్హతలకు అనుగుణమైన ఉద్యోగాలు లభిస్తున్నాయని తెలిపింది. విద్యా వ్యవస్థలో ప్రాక్టికల్ లెర్నింగ్కు తగిన ప్రాధాన్యం లేకపోవడం, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకు అనుగుణంగా విద్యను తీర్చిదిద్దకపోవడం ప్రధాన కారణాలుగా పేర్కొంది.
ఈ పరిస్థితిని అధిగమించేందుకు నీట్ యువతతో పాటు మహిళలకు కూడా తక్కువ ఖర్చుతో లేదా సబ్సిడీతో నైపుణ్య శిక్షణ అందించాలని నీతి ఆయోగ్ సూచించింది. అవసరమైన వారికి ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా నైపుణ్యాభివృద్ధి అవకాశాలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని సిఫారసు చేసింది.

