
తిరుమలలో శ్రీవారి భక్తులకు క్యూలైన్లలో అన్నప్రసాదాల విషయంలో ఇబ్బందులు లేకుండా టీటీడీ వినూత్న విధానాన్నితీసుకొచ్చింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ప్రసాదాలు అందించేందుకు మూవింగ్ టేబుల్ను తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేయగా విజయవంతం అయ్యింది. దీంతో తిరుమలలో మూవింగ్ టేబుల్స్ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నూతన విధానంతో తోపులాటలు ఉండవు.. సమయం కూడా ఆదా అవుతుంది.
తిరుమలలో కొంతకాలంగా భక్తుల రద్దీ కనిపిస్తోంది.. టోకెన్ లేకుండా వచ్చే భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు 18 గంటల నుంచి 24 గంటల వరకు సమయం పడుతోంది. దీంతో భక్తులు గంటల తరబడి క్యూలైన్లలోనే వేచి ఉంటున్నారు.. టీటీడీ భక్తుల రద్దీని గమనిస్తూ వారికి అవసరమైన అన్నప్రసాదాలను క్యూ లైన్లలోనే అందిస్తో్ంది. శ్రీవారి సేవకుల ద్వారా ఈ అన్నప్రసాదాలను అందిస్తుండగా.. కానీ రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులకు ప్రసాదాలు అందించడం కాస్త ఇబ్బందిగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా.. తిరుమలలో భక్తులకు క్యూ లైన్లలో అన్నప్రసాదాలను మరింత వేగంగా అందించేందుకు టీటీడీ మరో వినూత్న విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. ఎయిర్పోర్ట్లలో లగేజీ కన్వేయర్ బెల్ట్ మాదిరిగానే తిరుమలలోనూ అన్నప్రసాదాలు అందించేందుకు మూవింగ్ టేబుల్స్ విధానాన్ని తీసుకొచ్చింది.
తిరుమలలోని క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు మూవింగ్ టేబుల్ విధానాన్ని డిజైన్ చేశారు. రూ.10 లక్షల వరకు ఖర్చు చేసి 7 మీటర్ల పొడవుతో ఈ యంత్రాన్ని తయారు చేశారు. ఎయిర్పోర్ట్లలో లగేజీ కన్వేయర్ బెల్ట్లాగే ఇది తిరుగుతూ ఉంటుంది.. భక్తులు ఆ యంత్రంపై ఉంచిన అన్నప్రసాదం ప్లేట్లను తీసుకునేలా ప్లాన్ చేశారు. ఈ కొత్త విధానంతో శ్రీవారి సేవకులకు సులభంగా ఉంటుంది.. సమయం ఆదా అవుతుంది, పంపిణీ సమయంలో తోపులాటలు కూడా ఉండవు.
తిరుమలలో భక్తులు ఎక్కువగా ఉండే క్యూలైన్ల పక్కనే ఈ మూవింగ్ టేబుల్ ఏర్పాటు చేస్తారు. శ్రీవారి సేవకులు ముందుగానే ప్లేట్లలో అన్నప్రసాదాలతో సిద్ధం చేసి ఉంచుతారు. ఆ అన్నప్రసాదం ప్లేట్లను మూవింగ్ టేబుల్పై పెట్టగానే ముందుకు కదులుతూ ఉంటాయి. అప్పుడు భక్తులు క్యూలైన్లో నడుస్తూనే ప్లేట్ తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ మూవింగ్ టేబుల్పై భక్తులు ప్లేట్లు తీసుకోగానే.. ఖాళీ ఉన్న చోట మళ్లీ అన్నప్రసాదం ప్లేట్లు ఉంచుతారు.

