
ఓ వృద్ధురాలు తన చిరకాల కోరికను ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి ఆయనతో ఫొటో దిగాలన్న ఆమె కోరికను సీఎం స్వయంగా నెరవేర్చారు. చీరాలకు చెందిన 90 ఏళ్ల పుష్పవతి సీఎం చంద్రబాబును కలిసి మాట్లాడాలని, ఆయనతో కలిసి ఫొటో దిగాలని కోరకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన స్పందించారు. చీరాల వచ్చినప్పుడు కలిసి మాట్లాడతానని ఆమెకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో శుక్రవారం చీరాల పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు పుష్పవతిని పిలిపించారు. ఆమెను తన వాహనం వద్దకు తీసుకెళ్లి ఆప్యాయంగా పలకరించారు.
ఆ తర్వాత ఆమెను వాహనంలో కూర్చోబెట్టుకుని కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి ఆయన ఫొటో దిగారు. దీంతో పుష్పవతి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తన చిరకాల కోరిక నెరవేరడంతో ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఆమెతో కలసి సీఎం చంద్రబాబు దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

