
కాకినాడ ట్రాఫిక్ కష్టాలకుచెక్ పెడుతూ చేపట్టిన బైపాస్, ఏడీబీ రోడ్డు పనులు ముగింపు దశకు వచ్చాయి. త్వరలోనే ఈ బైపాస్, ఆ రోడ్డుడు అందుబాటులోకి రానున్నాయి. ఈ బైపాస్ పనులు 95శాతం పూర్తికాగా.. వీలైనంత త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ బైపాస్ అందుబాటులోకి వస్తే భారీ వాహనాలు కాకినాడలోకి రాావాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. అంతేకాదు అచ్చంపేట ఫ్లై ఓవర్ పూర్తికావడంతో వాహనాలను అనుమతిస్తున్నారు.
కాకినాడలో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోనున్నాయి.. వాహనాల రద్దీ నియంత్రించేందుకు చేపట్టిన రెండు కీలక ప్రాజెక్టులు ముగింపు దశకు వచ్చాయి. త్వరలోనే కాకినాడ బైపాస్ , ఏడీబీ రోడ్డు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. గతంలోనే పనులు ప్రారంభించినా ఆ తర్వాత ఆగిపోయాయి. . ప్రస్తుతం నగరం మీదుగా భారీ వాహనాలు వెళ్లడంతో ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి.. కూటమి ప్రభుత్వం వెంటనే పనుల్ని ప్రారంభించడంతో ముగింపు దశకు వచ్చాయి. ఈ రోడ్లు అందుబాటులోకి వస్తే ప్రజలకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
కాకినాడ బైపాస్ నిర్మాణ పనులు దాదాపు 95శాతం పూర్తయ్యాయి.. ఈ బైపాస్ 18 కిలోమీటర్ల పొడవున ఉంది. కత్తిపూడి నుంచి యానాం, అమలాపురం వెళ్లే భారీ వాహనాలు కాకినాడలోకి రావాల్సిన అవసరం లేకుండా.. తిమ్మాపురం నుంచి చొల్లంగి వరకు వెళ్లేలా ప్లాన్ చేశారు. గతంలో గంటకు పైగా పట్టే ప్రయాణ సమయం.. ఈ బైపాస్ ద్వారా కేవలం 20 నిమిషాలకు తగ్గిపోతుందని చెబుతున్నారు. మాధవపట్నం టు చీడిగ, కొవ్వూరు మీదుగా చొల్లంగి వరకు పునులు పూర్తి కావడంతో వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. మాధవపట్నం దగ్గర రైల్వే క్రాసింగ్ పనులు కూడా ఇటీవల పూర్తి చేశారు. ఈ బ్రిడ్జికి రంగులు వేసి.. తారు రోడ్డు పూర్తి చేయగా.. మార్కింగ్ చేయాల్సి ఉంది. ఈ పనులు కూడా పూర్తిచేస్తే బైపాస్లో రాకపోకలకు అనుమతించడానికి లైన్ క్లియర్ అవుతుంది.. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
కాకినాడ పోర్టుకు రాజానగరం నుంచి రాక్ సిరామిక్ కూడలి మీదుగా కనెక్ట్ చేసేలా నిర్మిస్తున్న ఏడీబీ రోడ్డు పనులు కూడా ముగింపు దశకు వచ్చాయి. ప్రస్తుతం అక్కడ ఉన్న రైల్వే క్రాసింగ్ పనులు వేగవంతం చేశారు. మిగిలిన రోడ్డు పనులు దాదాపు పూర్తచేసినట్లే.. ఈ రోడ్డుకు సంబంధించి అచ్చంపేట దగ్గర ఫ్లైఓవర్ పూర్తి కావడంతో ఇటీవలే వాహనాల రాకపోకలకు అనుమతించిన సంగతి తెలసిందే. అచ్చంపేట కూడలి మీదుగా మెడికవర్ ఆసుపత్రి నుంచి పోర్టుకు వెళ్లే రోడ్డులో భారీ వాహనాలు రాకపోకలు సాగించేవి. భారీ వాహనాల కారణంగా ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. అచ్చంపేట ఫ్లై ఓవర్ పనులు పూర్తిచేయడంతో భారీ వాహనాలు కాకినాడలోకి రాకుండానే పోర్టు రోడ్డులోకి వెళ్లిపోతున్నాయి. మొత్తం మీద కాకినాడ ట్రాఫిక్ సమస్యలు ఒక్కొక్కటిగా క్లియర్ అవుతున్నాయి.

