
టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్యపై మంత్రి టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టే పోలీసు నిఘా వ్యవస్థ ఈ విషయంలో ఏమైందంటూ ప్రశ్నించారు. ఇంతియాజ్ మరణానికి ముందే రిప్ అంటూ పోస్టు పెడితే కనీసం ఎందుకు పట్టించుకోలేదని అడిగారు. వైసీపీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోందని విమర్శించారు. కర్నూలు ఎస్పీ జిల్లాలో జరుగుతున్న పరిణామాలను సీరియస్గా తీసుకుని, నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని ఆయన కోరారు.
కర్నూలు జిల్లాలో నిఘా వ్యవస్థ విఫలమైందంటూ మంత్రి టీజీ భరత్ అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్య ఘటనపై మాట్లాడిన ఆయన, పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంతియాజ్ హత్యకు ముందే పోస్టు పెట్టినా కూడా పోలీసుల దృష్టికి ఎందుకు వెళ్లలేదంటూ ప్రశ్నించారు. మంత్రులు ఎక్కడికి వెళ్తున్నారు.. ఎవర్ని కలుస్తున్నారు.. అనే విషయాలు నిఘా అధికారులకు ఎప్పటికప్పుడు తెలుస్తున్నప్పుడు.. ఇలాంటి నేరాలకు సంబంధించిన వ్యక్తుల కదలికలపై పోలీసులకు సమాచారం ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు.
కర్నూలులో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ను పక్కా పథకం ప్రకారమే హతమార్చారంటూ మంత్రి భరత్ ఆరోపణలు చేశారు. వైఎస్సార్సీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో వైసీపీ రౌడీ మూకలు హత్యలు, హత్యాయత్నాలతో అరాచకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహించారు. హత్యకు గురైన ఇంతియాజ్ గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారన్న ఆయన.. అప్పట్లో కూడా తన నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని వైసీపీ వర్గీయులు ఇంతియాజ్ను బెదిరించినట్లు ఆరోపించారు.
హంద్రీనదిలో జరుగుతున్న కబ్జాలను బయటపెట్టారని, వైసీపీ అక్రమాలను ప్రశ్నించారనే కారణాలతోనే ఇంతియాజ్ను హత్య చేశారంటూ మంత్రి టీజీ భరత్ ఆరోపించారు. గత రెండేళ్లలో కర్నూలులో మూడు హత్యలు జరిగాయని.. ప్రతి హత్యలోనూ వైసీపీ ప్రమేయం ఉందని, దానికి తన వద్ద సమాచారం కూడా ఉందంటూ భరత్ పేర్కొన్నారు. కర్నూలులో పరిస్థితులపై ఎస్పీ ప్రత్యేక దృష్టిసారించాలని మంత్రి కోరారు. నేరస్థుల కదికలపై మరింత నిఘా పెంచాలన్నారు.

