
నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో శ్రీవారి గోవింద నామాలను పేరడీ చేయటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం గోవింద నామాలను అపహాస్యం చేసి, భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని స్పష్టం చేశారు. ఇలాంటివి ఆపాలని సూచించారు. మరోవైపు ఈ అంశంపై చట్టపరంగా ముందుకెళ్లాలని జనసేన నేతలకు సూచించారు. మరోవైపు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గోవింద నామాలను ఇలా పేరడీ చేయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
డీఎస్సీ 2025లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నెల్లూరులో వైసీపీ చేపట్టిన రిలే నిరాహారదీక్షలు వివాదాస్పదమయ్యాయి. ఈ రిలే నిరాహార దీక్షలలో వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి.. శ్రీవారి గోవింద నామాలను అపహాస్యం చేశారని కూటమి శ్రేణులు, సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు ఆరోపిస్తున్నారు. పవిత్రమైన శ్రీవారి గోవింద నామాలు, భక్తి గీతాలను పేరడీ చేసి పాడిస్తూ అపహాస్యం చేశారంటూ.. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తిరుమల కొండపై గోవిందా హరి గోవిందా అని వినిపించే.. గోవింద నామాలను రాజకీయ ప్రయోజనాల కోసం పేరడీ చేసి.. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ వైసీపీ నేతలపై కూటమి నేతలు, పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి గోవింద నామాలను పేరడీ చేసిన అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపాలని స్పష్టం చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని భక్తితో కొలుస్తూ ఆలపించే పవిత్ర దైవ నామాలను, భక్తి గీతాలను రాజకీయ అవసరాల కోసం పేరడీలుగా పాడుతూ అపహాస్యం చేయడాన్ని పవన్ కళ్యాణ్ ఖండించారు.

