
ఏపీలో మద్యం పాలసీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ నెలతో పాలసీ ముగుస్తుండగా.. ప్రభుత్వం కొత్త పాలసీపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఉన్న పాలసీనే రెన్యువల్ చేయాలా?.. కొత్త పాలసీ తీసుకురావాలా అనే ప్రతిపాదనలు తీసుకొచ్చారు. పాలసీని రెన్యువల్ చేసే అంశంపైనా ప్రధానంగా చర్చ జరుగుతోంది. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీకి సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2024 అక్టోబర్లో కొత్త పాలసీ అమల్లోకి వచ్చింది.. ఏడాది అక్టోబర్ నాటికి రెండేళ్లు పూర్తికానున్నాయి. ఈ క్రమంలో కొత్త పాలసీ కింద మళ్లీ దరఖాస్తులా?.. పాలసీని రెన్యువల్ చేయాలా? అనే రెండు ప్రతిపాదనల్ని ఎక్సైజ్శాఖ సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రధానంగా పాలసీని రెన్యువల్ చేసే అంశంపై చర్చ జరుగుతోంది.. అదే జరిగితే మరో రెండేళ్ల పాటూ ప్రస్తుతం మద్యం షాపులు నడిపిస్తున్నవారికే అవకాశం దక్కుతుంది. 2024లో పాలసీ సమయంలో 90వేల దరఖాస్తులకు గాను రూ.1990 కోట్లు ఫీజుల రూపంలో వచ్చాయి. షాపులు దక్కిన వారు తమకు సరైన మార్జిన్ ఇవ్వలేదని.. నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఎక్సైజ్శాఖ సమీక్ష చేసి మార్జిన్ పెంచింది.
ఇలాంటి పిరిస్థితుల్లో మళ్లీ కొత్త పాలసీకి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఈసారి మళ్లీ కొత్త పాలసీ తీసుకొస్తే ఎన్ని దరఖాస్తులలొస్తాయో క్లారిటీ లేదు. ఒకవేళ తక్కువ ధరఖాస్తులు వస్తే.. ప్రభుత్వ ఖజానాకు లోటు ఏర్పడుతుంది. అందుకే కొత్త పాలసీ కాకుండా ఇప్పుడు ఉన్న లైసెన్సీలకు పాలసీ రెన్యువల్ చేయాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. గతంలో వచ్చిన రూ.1900 కోట్లను లైసెన్స్ ఫీజులుగా చెల్లిస్తే రెన్యువల్ చేసే అవకాశం ఉంటుందంటున్నారు. పట్టణాల్లో రూ.40 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 లక్షల చొప్పున లైసెన్సీలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఏడాదికి 50శాతం చొప్పున చెల్లించేలా ప్లాన్ చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా లైసెన్సీలు చాలామంది రెన్యువల్కు ఓకే చెబుతున్నారు. కొందరు మాత్రం అంత భారీ మొత్తం ఫీజు చెల్లించలేమంటున్నారు. రెన్యువల్తో పాటుగా కొత్తగా పాలసీకి వెళ్లడంపైనా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఒకవేళ రెన్యువల్ చేస్తే ప్రతిపక్షం నుంచి విమర్శలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. అధికార పార్టీవారికి రెన్యువల్ చేశారంటూ టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం ఈ అంశాలన్ని పరిశీలించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ కొత్త పాలసీ తీసుకొస్తే దరఖాస్తుల ప్రక్రియను ఈ నెలాఖరు కానీ, వచ్చే నెలలో కూడా కానీ ప్రారంభించాల్సి ఉంటుంది.

