
D news: మంగళగిరి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా గురువారం అమరావతిలో జరగనున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి పవన్ను ఆహ్వానించారు.
అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలు తదితర ప్రాజెక్టుల ప్రారంభోత్సవం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు స్టీల్ బ్రిడ్జిలతో పాటు సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు నారాయణ తెలిపారు.
రాజధాని మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగంగా చేపడుతున్న మంత్రి నారాయణను పవన్ కల్యాణ్ అభినందించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు రాజధాని అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు.
విశాఖలో గురువారం నిర్వహించనున్న జాతీయ స్థాయి ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సి ఉన్నందున అమరావతి కార్యక్రమానికి హాజరు కాలేనని పవన్ తెలిపారు. తన అభ్యర్థన మేరకు విశాఖలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ కూడా కార్యక్రమానికి హాజరవుతారని వెల్లడించారు.

