
D news: న్యూఢిల్లీ: విద్యుదాఘాత ప్రమాదాలు, మరణాలకు సంబంధించిన కేసుల్లో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యుత్ శాఖ లేదా సరఫరా సంస్థల నిర్లక్ష్యం కారణంగా కరెంట్ షాక్ ప్రమాదాలు జరిగితే వాటికి సంబంధిత సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే ప్రతి విద్యుదాఘాత ఘటనలోనూ ఎలాంటి మినహాయింపులు లేకుండా విద్యుత్ శాఖదే పూర్తి బాధ్యత అని చెప్పలేమని పేర్కొంది.
జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. విద్యుత్ ప్రమాదాలకు మోటార్ వాహన చట్టంలోని సూత్రాలను వర్తింపజేసి అధిక పరిహారం అందించాలంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
అసలేం జరిగింది?
కర్ణాటకలో క్రికెట్ ఆడుతున్న సమయంలో బంతిని తీసుకునేందుకు వెళ్లిన ఓ వ్యక్తి అనుకోకుండా 66 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ను తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఘటనలో 11 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ను తాకి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ రెండు ఘటనల్లో బాధితులు నష్టపరిహారం కోసం కోర్టును ఆశ్రయించారు. కేసులను విచారించిన కర్ణాటక హైకోర్టు.. మోటార్ వాహన చట్టంలోని సూత్రాలను విద్యుత్ ప్రమాదాలకు వర్తింపజేసి బాధితులకు అధిక పరిహారం చెల్లించాలని విద్యుత్ శాఖను ఆదేశించింది.
దీనిపై కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. విద్యుత్ సంస్థ నిర్లక్ష్యం లేదా బాధ్యత కారణంగా జరిగిన ప్రమాదాల్లో సంస్థ బాధ్యత వహించాల్సి ఉంటుందని అంగీకరించింది. అయితే ప్రతి ఘటనకు ఒకే విధమైన బాధ్యతను వర్తింపజేయడం సరికాదని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో గతంలో కర్ణాటక హైకోర్టు సింగిల్, డివిజన్ బెంచ్లు ఇచ్చిన సంబంధిత ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

