
గుంటూరు, D news: రాజకీయాల్లో విమర్శలకు కూడా ఒక పరిమితి ఉంటుందని, ఆ హద్దులు దాటితే చూస్తూ ఊరుకోబోమని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్పై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు.
‘రప్పా.. రప్పా’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై యరపతినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరికే మగాడు ఎవరో చెప్పాలని, కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించారు. దళిత మహిళ హోంమంత్రిగా ఉన్న సమయంలో ఆమెను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమేనని, అయితే అవి హద్దులు దాటకూడదని స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహించారని యరపతినేని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అలాంటి రాజకీయాలకు దూరంగా ఉందన్నారు. సీదిరి అప్పలరాజును పరామర్శించే పేరుతో ఐదు గంటల పాటు ప్రదర్శన నిర్వహించారని విమర్శించారు.
విరూపాక్ష అరెస్టు విషయంలో ముందుగా నోటీసులు ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ కోరుతున్నారని పేర్కొన్న ఆయన.. గతంలో నంద్యాల ఘటనలో చంద్రబాబును నోటీసులు ఇవ్వకుండానే ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు.
వైసీపీ ఎమ్మెల్యేలకు ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలని యరపతినేని సవాల్ విసిరారు. వైసీపీ వ్యవహారశైలి ప్రజల్లో వ్యవస్థపై నమ్మకం కోల్పోయేలా చేస్తోందని విమర్శించారు. గతంలో ఇలాంటి రాజకీయ పోకడలతో అనేక పార్టీలు కనుమరుగయ్యాయని, వైసీపీకి కూడా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

